గుజరాత్, హిమాచల్ లో బీజేపీ హవా ! ఢిల్లీని మళ్లీ ఊడ్చేసిన ఆప్ ! ఎగ్జిట్ పోల్స్ పై ఓ విశ్లేషణ !
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై ఇవాళ పలు జాతీయ మీడియా ఛానళ్లు, సర్వేసంస్ధలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు స్పష్టంగానే ఉన్నాయి. దీని ప్రకారం గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉందని దాదాపు అన్ని సర్వే సంస్ధలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం గట్టి పోటీ జరిగిందని, అయినా బీజేపీకి మొగ్గు లభించే అవకాశముందని అంచనావేశాయి. ఢిల్లీ కార్పోరేషన్ లో మాత్రం ఆప్ విజయం ఖాయమని అంతా తేల్చేశారు.
గుజరాత్ లో మళ్లీ బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగిందని అంతా భావించినా అలాంటిదేమీ లేదని తేలిపోయింది. కేవలం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ జరిగినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆప్ ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని సర్వే సంస్ధల ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్పాయి. ఆప్ కంటే స్వతంత్రులే ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి గుజరాత్ లో బీజేపీ వంద సీట్లకు పైగానే సాధిస్తుందని ప్రతీ ఎగ్జిట్ పోల్ తేల్చింది. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హిమాచల్ పోరులో బీజేపీకే మొగ్గు
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడా బీజేపీకే మొగ్గు కనిపిస్తోంది. అయితే సీట్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటం, గతంలో ఇలా స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా కాంగ్రెస్ ను బీజేపీ దెబ్బతీసిన సందర్భాలు చూస్తే ఈ హిమాలయ పర్వత రాష్ట్రంలో కాషాయ సేన అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ మాత్రమే కాంగ్రెస్ కు స్వల్ప మొగ్గు ఇచ్చింది. అలాగే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ ఆప్ హిమాచల్ లో ఖాతా తెరవడం లేదని తేల్చేశాయి.
ఢిల్లీలో ఆప్ క్లీన్ స్వీప్
మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ మరోసారి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమైనట్లు ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 250 సీట్లున్న ఢిల్లీ కార్పోరేషన్ లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో బీజేపీకి మరోసారి ఆశాభంగం తప్పడం లేదు. అలాగే 15 ఏళ్ల తర్వాత ఎంసీడీ పీఠాన్ని బీజేపీ ఆప్ కు అప్పగించబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 లోపు సీట్లకే పరిమితమవుతున్నట్లు తేలిపోయింది. కాంగ్రెస్ మరోసారి నామమాత్రంగానే మిగిలింది. ఢిల్లీలో మరో కీలక విజయం అందుకోబోతున్న కేజ్రివాల్ కు గుజరాత్, హిమాచల్ ఫలితాలు నిరాశను మిగిల్చేలా ఉన్నాయి.