నేను ముందే చెప్పా-ఆయనకు స్ధిరత్వం లేదని-సిద్ధూ రాజీనామాపై అమరీందర్ ట్వీట్
పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ పదవికి రాజీనామా చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన ప్రత్యర్ది, మాజీ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్దూ రాజీనామా విషయం తెలియగానే వెంటనే ఆయన దీనిపై ట్వీట్ చేశారు. మీకు ముందే చెప్పానంటూ అమరీందర్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సిద్ధూ రాజీనామాపై స్పందించిన పంజాబ్ తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ .. ఆయన స్ధిరత్వం లేని మనిషని, తాను ముందే చెప్పానని వ్యాఖ్యానించారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి పార్టీ బాస్ గా అతను సరిపోడని కూడా చెప్పినట్లు అమరీందర్ తెలిపారు. దీంతో ఈ ట్వీట్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఉద్దేశించే అమరీందర్ సింగ్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ గా ఉన్న తనకు పొగపెట్టేందుకు సిద్ధూను ప్రోత్సహించిన కాంగ్రెస్ హైకమాండ్... ఆయన చెప్పినట్లు విని సీఎం పదవికి తనను దూరం చేసిందన్న ఆక్రోశం అమరీందర్ లో కనిపిస్తోంది.
పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ గా సిద్ధూను నియమించడం ద్వారా సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ తో వివాదం చల్లార్చాలని ముందుగా ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ.. తర్వాత ఆయన మాట విని సీఎంగా ఉన్న అమరీందర్ ను సైతం తప్పించింది. దీంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుతం అమరీందర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన ఆయన మీడియా ఇన్ ఛార్జ్ .. ఇలాంటి ప్రచారాలు చాలా చూశామన్నారు. అమరీందర్ వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీ వచ్చారని తెలిపారు.
I told you so…he is not a stable man and not fit for the border state of punjab.
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 28, 2021