హిమలింగ రూపంలో అమరేశ్వరుడి దర్శనం.. ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర!
ఆకాశమే హద్దుగా నిలిచిన హిమగిరులు.. గాల్లో మారుమోగుతున్న 'బమ్ బమ్ భోలే' నామస్మరణలు.. శివనామ స్మరణతో పులకించిపోతున్న భక్తజన హృదయాలు.. భారతావనిలోనే అత్యంత పవిత్రమైన, విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రయాణం 'శ్రీ అమర్నాథ్ యాత్ర 2026' వైభవంగా ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో, సుమారు 3,880 మీటర్ల ఎత్తులో కొలువై, ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కాశ్మీర లోయ భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. గురువారం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
రికార్డు స్థాయి రద్దీ.. అద్భుత ఏర్పాట్లు
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సునీల్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి బ్యాచ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, జమ్మూ కాశ్మీర్ ష్రైన్ బోర్డ్ కల్పించిన అత్యాధునిక వసతులు భక్తుల ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ జుగల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ.. భక్తుల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోందని, యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం లోయలోని బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్లు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.

ఆగస్టు 28 వరకు.. రెండు మార్గాల్లో ప్రయాణం
మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ వార్షిక యాత్ర జూలై 3వ తేదీన అధికారికంగా రెండు మార్గాల ద్వారా ఏకకాలంలో ప్రారంభం కానుంది.
పహల్గామ్ మార్గం: అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయక 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం.
బాల్తాల్ మార్గం: గందర్బాల్ జిల్లాలోని అత్యంత నిటారైన, తక్కువ దూరంతో కూడిన 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం.
ఈ పవిత్ర యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ముగియనుంది. భక్తులు తమ ఆరాధ్య దైవమైన పరమశివుని జ్యోతిస్వరూపాన్ని దర్శించుకోవడానికి కఠినమైన వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా అడుగులు వేస్తున్నారు.
నిఘా నీడలో హిమగిరులు.. కట్టుదిట్టమైన భద్రత
భక్తుల భద్రత విషయంలో యంత్రాంగం ఎలాంటి రాజీ పడటం లేదు. యాత్ర ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఉధంపూర్లోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని సిఆర్పిఎఫ్ (CRPF) 137వ బెటాలియన్ సిబ్బంది, K9 డాగ్ స్వ్కాడ్ తో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేసి క్లియర్ చేశారు. అంతకుముందు మంగళవారం శ్రీనగర్లోని పాంథా చౌక్ బేస్ క్యాంప్ వద్ద కొత్తగా నిర్మించిన 'శ్రీ ప్రేమ్ గార్గ్ భవన్' యాత్రి నివాస్ వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారామిలట్రీ దళాలు కలిసి ఉమ్మడిగా యాంటీ టెర్రర్ మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. రూట్ల వెంబడి మల్టీ-లేయర్ సెక్యూరిటీ గ్రిడ్ను ఏర్పాటు చేసి, యాత్రికులకు పూర్తి రక్షణ వలయాన్ని కల్పించారు.
#WATCH | J&K | A large number of pilgrims have arrived at the Yatri Niwas Bhagwati Nagar base camp in Jammu for the Shri Amarnath Ji Yatra 2026.
— ANI (@ANI) July 1, 2026
J&K Lieutenant Governor Manoj Sinha will flag off the first batch, and the convoy of pilgrims will depart for the Baltal and Pahalgam… pic.twitter.com/MdUJ4VQYkg














Click it and Unblock the Notifications