ఆంబిడెంట్ చీటింగ్ కేసు: రూ. 20 కోట్లు ఇచ్చేస్తా, గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు: అన్నీ మరిచిపోయాను!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఆంబిడెంట్ కంపెనీ నుంచి తాను రూ. 20 కోట్లు తీసుకున్నానని, ఆ మొత్తం తాను తిరిగి ఇచ్చేస్తానని, దయచేసి తనను వదిలిపెట్టాలని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుచురుడు ఆలీఖాన్ అంటున్నారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. తనకు ఆంబిడెంట్ కంపెనీ గురించి వేరే విషయాలు తెలియడం లేదని ఆలీఖాన్ పోలీసుల విచారణలో చెప్పాడని తెలిసింది.
పోలీసు కస్టడి
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో విచారణ చేస్తున్న బెంగళూరు సీసీబీ పోలీసులు ఆలీఖాన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. పోలీసు కస్టడిలో ఆలీఖాన్ నుంచి పలు వివరాలు సేకరించాలని సీసీబీ పోలీసులు ప్రయత్నించారు.
అన్నీ మరిచిపోయాను
ఆంబిడెంట్ చీటింగ్ కేసులో ఎవరెవరికి సంబంధం ఉంది ? ప్రజలు నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎవరెవరు వాటాలు పంచుకున్నారు ? అనే విషయాలు సేకరించాలని సీసీబీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణ సమయంలో తనకు ఏమీ తెలీదని, అన్ని విషయాలు మరచిపోయానని ఆలీఖాన్ చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు.
రూ. 20 కోట్లు ఇచ్చేస్తా
తాను బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే రూ. 20 కోట్లు తిరిగి ఇచ్చేస్తానని ఆలీఖాన్ పోలీసులకు మనవి చేశాడని తెలిసింది. ఆంబిడెంట్ కంపెనీ విషయంలో ఇప్పటి వరకు తనకు తెలిసిన వివరాలు చెప్పానని, అంతకు మించి తనకు ఏమీ తెలీదని, తనను వదిలిపెట్టాలని ఆలీఖాన్ అంటున్నాడని ఓ విచారణాధికారి అంటున్నారు.
సెంట్రల్ జైలుకు ఆలీఖాన్
8 రోజుల పాటు పోలీసు కస్టడీ గడుపు ముగియడంతో ఆలీఖాన్ ను కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు చెయ్యడంతో ఆలీఖాన్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఆంబిడెంట్ కంపెనీ వ్యవహారంలో పలు సాక్షాలను సేకరించారని తెలిసింది.
మొండిఘట్టం
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విషయంలో ఆలీఖాన్ సరైన సమాచారం ఇవ్వలేదని, అతను విచారణలో మొండిఘట్టంలా ప్రవర్తించాడని పోలీసులు అంటున్నారు. అన్ని ప్రశ్నలకు తనకు తెలీదు, మరిచిపోయాను, వదిలేయండి అనే సమాధానం చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు.