చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి రెండు నెలలు గడుస్తున్నా సడలని ఉద్రిక్తత.. రెండు వైపులా పోటాపోటీగా సైనిక బలగాలు, ఆయుధాల సమీకరణ.. అటునుంచి నరుక్కొచ్చే ప్రక్రియలో భాగంగా చైనీస్ యాప్స్, కంపెనీలపై నిషేధాలు.. ప్రతిగా చైనాలోని భారతీయ చానెళ్ల నిలిపివేత, విద్యార్థులకు బెదిరింపులు.. రెండు అతిపెద్ద సైనిక శక్తుల మధ్య గొడవలు ముదురుతుండటంతో ప్రపంచ దేశాల కలవరపాటు.. కీలకమైన సమయంలో అన్ని దేశాలూ ఇండియాకు అండగా నిలవడం.. చైనా దురాగతాలపై ఒక్కో దేశం తిరుగుబాటును ప్రకటిస్తుండటం.. ఈ పరిణామాల నడుమ భారత ప్రధాని నరేంద్ర మోదీ లదాక్ పర్యటన సంచలనం రేపింది.
Recommended Video
సర్ప్రైజ్ వెనుక ఐదు వ్యూహాలు..
ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తత, ప్రధానంగా లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు భారత్ విశ్వప్రయత్నం చేస్తుండగా చైనా మాత్రం చర్చల్లో బెట్టు చేస్తూ వస్తోంది. వాస్తవానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం లదాక్ లో పర్యటించాల్సి ఉండగా, అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ప్రధాని మోదీనే అక్కికెళ్లారు. లేహ్ కు సమీపంలోని ప్రఖ్యాత నిమూ గ్రామానికి సమీపంగా.. సింధు నది ఒడ్డునుండే Zanskar range ఫ్రంట్ లైన్ వద్ద ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ బలగాలతో ప్రధాని మాట్లాడారు. మోదీ లదాక్ పర్యటన వెనుక ప్రధానంగా ఐదు వ్యూహాలున్నట్లు వెల్లడైంది.

వెనుకడుగు ప్రసక్తేలేదు..
పొరుగుదేశాల్లోకి చైనా చొరబడటం కొత్తేమీ కాదు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన చుట్టుపక్కల దేశాలకు చెందిన సుమారు 1లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కబ్జా చేసిన చరిత్ర చైనాది. 1962 యుద్ధం తర్వాత మన భూభాగంలోకి కూడా కొంచెం కొంచెంగా చొరబడింది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ సైన్యాలు, ఆయుధ సామాగ్రితో చైనా ముందుకురావడం గమనార్హం. మందబలంతో స్టేటస్ కోను మార్చేస్తే.. ఆ భూమిని భారత్ వదిలేస్తుందిలే అని చైనా భావించింది. కానీ దాని ఆలోచన తప్పని, ఇంచు భూమి కూడా వదులుకోబోమని గట్టిగా హెచ్చరించడం మోదీ లదాక్ పర్యటలోని మొదటి వ్యూహం.

అన్ని విధాలుగా సన్నద్ధత..
ఎల్ఏసీ వద్ద ఏప్రిల్ నాటి స్టేటస్ కో కోసం భారత్ పట్టుపడుతోంది. బలగాల ఉపసంహరణకు మనం సిద్ధమైనా, చైనా మాత్రం వెనక్కెళ్లబోమని బెట్టుచేస్తోంది. ఆ క్రమంలోనే గత నెలలో గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగి, రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. ప్రధాని మోదీ లేహ్ లో పర్యటించే నాటికి కూడా చైనా తీరులో మార్పురాలేదు. ఎల్ఏసీ సమీపంగా చైనా నిర్మించిన భారీ మౌలిక సదుపాయాలు పాకిస్తాన్, సెంట్రల్ ఆసియా వరకు విస్తరించి ఉన్నాయి. ఇటువైపు భారత్ చేపడుతోన్న నిర్మాణాలతో తన జియోస్ట్రాటజిక్ డిజైన్ల ఖర్చు పెరుగుతుందన్నది చైనా ఆందోళన. అసలు గొడవంతా మనం నిర్మించే ప్రాజెక్టులపైనే అన్నది తెలిసిందే. ఇండియా జీడీపీ.. చైనా జీడీపీలో 20 శాతం కూడా ఉండదని, భారత సైనిక శక్తికంటే చైనా పీఎల్ఏ బలమే ఎక్కువని, ఏరకంగానూ మాతో పెట్టుకోలేరని డ్రాగన్ విర్రవీగుతోన్న తరుణంలో.. భారత్ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని సందేశం కూడా మోదీ పర్యటనలోని రెండో వ్యూహం.

భారత్ ఒంటరి కాదు..
చైనా పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తుండటంతో.. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సైనిక, దౌద్య చర్చల ద్వారా భారత్ చేస్తోన్న ప్రయత్నాలు ఆశించినమేరకు ఫలించలేదు. దీంతో అమీతుమీ తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. భారత్-చైనా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా.. చైనా తీరుతో విసిగిపోయి, తన బలగాలను చైనా వైపునకు మళ్లించనున్నట్లు ప్రకటించింది. అమెరికా సహా పలు కీలక దేశాన్నీ అండగా నిలవడంతో భారత్ ఒంటరి కాదన్న సందేశాన్ని కూడా మోదీ చాటినట్లయింది.

యాంటీ చైనా వేవ్..
బెల్ట్ అండ్ రోడ్ పేరుతో కొన్ని దేశాలను వశం చేసుకునేందకు చైనా పన్నిన ఎత్తగడలను ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. కరోనా విలయం తర్వాత యాంటీ చైనా వేవ్ పీక్స్ కు చేరింది. హాంకాంగ్ లో భద్రతా చట్టం విషయంలో డ్రాగన్ కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. అవసరమైతే హాంకాంగ్ ను తిరిగి తీసేసుకుంటామంటూ బ్రిటన్ ప్రకటిండం, హాంకాంగ్ ను కాపాడేందుకు సైనిక చర్యకైనా వెనుకాడబోమని అమెరికా హెచ్చరించడంతో చైనా ఇరుకునపడ్డట్లైంది. ప్రస్తుతం ఉగ్రవాదుల కార్ఖానా పాకిస్తాన్ తప్ప ఏ దేశమూ చైనాకు మద్దతుగా నిలబడలేని పరిస్థితి. ఇది మోదీ కోరకుండానే భారత్ కు అదనంగా లభించిన ప్రయోజనం.

‘సరెండర్ మోదీ'కి సమాధానం..
ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ లదాక్ లో పర్యటించడం వెనకున్న వ్యూహాలు, కారణాల్లో చివరిది.. రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా సరిహద్దులో జరుగుతోన్న విషయాలపై కేంద్రం అబద్ధాలు చెబుతున్నదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గాల్వాన్ ఘర్షణలో మన జవాన్లు 20 మంది చనిపోయిన తర్వాత మోదీపై విమర్శలు మరింతగా పెరిగాయి. చైనాకు మోదీ సరెండర్ అయిపోయారని, డ్రాగన్ అగ్రెషన్ ను మోదీ ఏడానూ ఖండించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శుక్రవారం నాటి లేహ్ పర్యటనతో మోదీ తన ప్రత్యర్థుల నోళ్లు మూయించారనే భావన వ్యక్తమవుతున్నది.












Click it and Unblock the Notifications