చైనా సరిహద్దులో మళ్లీ సైనికుల ఘర్షణ? కీలక చర్చల వేళ కొట్లాట వీడియో.. మనోళ్లు ఉతికేశారు..
''ఇక్కణ్నుంచి వెళ్లిపోండి.. మీరు బోర్డర్ దాటి వచ్చారు..'' ఓ భారత జవాన్ మర్యాదపూర్వకంగా హెచ్చరించాడు. అవతల చైనా ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, కూడా ఐదారుగురు సైనికులున్నారు. మనవాళ్ల సంఖ్యా దాదాపు అంతే ఉంది. సదరు ఆఫీసర్లు మనవాళ్లతో ఆర్గ్యుమెంట్ కు దిగారు.. ''ఇది మా భూమి.. మీరే వెనక్కి వెళ్లిపోండి..''అని బెదిరించే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఓ చైనా జవాన్ గట్టిగా తిట్టుకుంటూ ఇటుకేసి దూసుకొచ్చాడు.. అంతే, వాణ్ని పట్టుకుని వీర ఉతుకుడు ఉతికేశారు మనోళ్లు. ఆ వెంటనే ఇరు పక్షాల సైనికులు గుంపుగా చేరి పిడిగుద్దులు విసురుకున్నారు. దాదాపు ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
Recommended Video

చర్చల వేళ కలకలం..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన ఆరు వారాలుగా ఉద్రిక్తత కొనసాగుతున్నది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో కబ్జాకు యత్నించిన డ్రాగన్ బలగాలను మనవాళ్లు తిప్పికొట్టారు. ఈక్రమంలో గతవారం గాల్వాన్ లోయలో తీవ్ర హింస చోటుచేసుకోవడం, మనవైపు 20 మంది జవాన్లు చనిపోగా, 76 మంది గాయపడటం తెలిసిందే. గాల్వాన్ హింస తర్వాతైనా పరిస్థితిని అదుపుచేసే ఉద్దేశంతో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో మరో దఫా చర్చలకు సిద్ధమయ్యారు. ఎల్ఏసీకి సమీపంగా చైనా భూభాగంలోని మాల్దో వద్ద సోమవారం చర్చలు జరుగుతున్న సమయంలోనే.. భారత్, చైనా జవాన్లు తీవ్రంగా కొట్లాడుకుంటోన్న ఓ వీడియో ఇంటర్నెట్ లో బ్రేక్ అయింది. దీంతో సరిహద్దులో మళ్లీ ఘర్షణ జరిగి ఉంటుదేమోననే ఆందోళన వ్యక్తమైంది.

ఎక్కడ జరిగిందా గొడవ?
గాల్వాన్ లోయలో జూన్ 15న రాత్రి హింసాయుత సంఘటన చోటుచేసుకోడానికి ముందు తూర్పు లదాక్ తోపాటు సిక్కిం ప్రాంతాల్లో రెండు వైపుల సైన్యాలు పలు చోట్ల బాహాబాహీకి దిగాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో తేదీలు గట్రా లేకపోవడం ఆందోళనల్ని రెట్టింపు చేసింది. గొడవ జరిగిన ప్రాంతంలో భారీగా మంచు ఉండటం, అక్కడి కొండలను బట్టి అది సిక్కిం సరిహద్దు అయి ఉండొచ్చని, రెండు వైపులా జవాన్లు మాస్కులు ధరించి ఉండటాన్ని బట్టి ఆ వీడియో ఇటీవల చిత్రీకరించిందేనని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘ఇండియా టుడే'తోపాటు పలు టీవీ చానెళ్లు ఈ కొట్లాట వీడియోను ప్రసారం చేశాయి.

ఇకపై ఉపేక్షించొద్దు..
ఎల్ఏసీ వెంబడి చైనా రోజురోజుకూ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో ఆ దేశంతో వ్యవహరించే ప్రోటోకాల్స్ ను భారత ప్రభుత్వం సవరించింది. ఎట్టిపరిస్థితుల్లోనై ఆయుధాలు వాడరాదన్న గత నిబంధలకు బదులుగా.. ఆత్మరక్షణ కోసం అత్యవసరమైతే వాడుకోవచ్చని ఆర్మీకి భరోసా కల్పించింది. సోమవారం చైనాతో జరిగిన చర్చల్లోనూ కొత్త ప్రొటోకాల్స్ అంశాన్ని భారత్ ప్రస్తావించినట్లు తెలిసింది. చర్చలకు వెళ్లిన భారత బృందానికి 14వ కార్ప్స్ కమాండరైన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, చైనా వైపు నుంచి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరైనట్లు సమాచారం.

మన టార్గెట్ అదే..
తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా ఆర్మీ, విదేశాంగ శాఖ ప్రకటనలు చేసినప్పటికీ.. కీలకమైన 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ14)ఇంకా మన ఆధీనంలోనే ఉన్నట్లు వెల్లడైంది. కాగా, ఏప్రిల్ 1 నాటి స్టేటస్ కో తిరిగి ఏర్పడేలా.. ప్రస్తుతం రెండు వైపులా మోహరించి ఉన్న బలగాలను ఉపసంహరించుకుందామని ముందునుంచీ చెబుతోన్న భారత్.. సోమవారం నాటి చర్చల్లోనూ అదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. చర్చలకు సంబంధిచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సిఉంది.












Click it and Unblock the Notifications