కర్ణాటక ప్రభుత్వానికి రూ. 1 లక్ష 50 వేల కోట్లు ఇచ్చాం, సీఎం లెక్క చెప్పాలి, బీజేపీ చీఫ్ అమిత్ షా !
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 130 అభివృద్ది పథకాలు అమల్లోకి వస్తాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గురువారం బెంగళూరు నగర శివా
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 130 అభివృద్ది పథకాలు అమల్లోకి వస్తాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గురువారం బెంగళూరు నగర శివార్లలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్రను అమిత్ షా ప్రారంభించారు.
ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ ప్రసగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి ఒక్క పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చెయ్యడం లేదని ఆరోపించారు. సిద్దరామయ్యతో పాటు ఆయన ప్రభుత్వం ఎప్పుడూ నరేంద్ర మోడీని విమర్శిస్తుందని, అది మంచి పద్దతి కాదని హితవుపలికారు.

రూ. ఒక లక్ష 50 వేల కోట్లు ఇచ్చాం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రానికి రూ. 1 లక్ష 50 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులు ఏమైనాయో అంటూ పూర్తి లెక్కచెప్పడానికి సీఎం సిద్దరామయ్య సిద్దంగా ఉన్నారా అంటూ అమిత్ షా ప్రశ్నించారు. కర్ణాటకలో స్మార్ట్ సిటీల అభివృద్ది కోసం రూ. 960 కోట్లు, ముద్రాణా పథకం కింద రూ. 39 వేల కోట్లు, అమృతా పథకం కింద రూ. 4,953 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అమిత్ షా అన్నారు.

హిందూవులను చంపేసినా పట్టించుకోరా !
సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటకలో 19 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు దారుణ హత్యకు గురైనారని అమిత్ షా ఆరోపించారు. దేశద్రోహుల మీద కేసులు నమోదు చేస్తే ఆ కేసులను సిద్దరామయ్య ప్రభుత్వం ఎత్తివేసిందని, కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు తప్పుడు సందేశాలు పంపిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

కాబోయే ముఖ్యమంత్రి ఆయనే !
సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో 75 రోజుల పాటు బీజేపీ నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర నిర్వహిస్తున్నారని, కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అని, అందులో ఎలాంటి సందేహం లేదని అమిత్ షా అన్నారు.

2018 ఎన్నికలు టార్గెట్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను అడ్డుకుంటున్న సీఎం సిద్దరామయ్య, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కర్ణాటకకు మొండి చెయ్యి చూపిస్తున్నదని ఇక్కడి ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కర్ణాటక ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, 2018 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్దిచెబుతారని అమిత్ షా చెప్పారు.

బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప తదితరులు పాల్గోన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన చెన్నపట్టణం ఎమ్మెల్యే సీపీ. యోగేశ్వర్, కుడచి శాసన సభ నియోజక వర్గం బీఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీ. రాజీవ్ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications