అబ్బే అమిత్ షా అలా అనలేదు: బీజేపీ
న్యూఢిల్లీ: భారతదేశం పూర్తిగా అభివృద్ధి జరిగి అంతా మంచి జరగాలంటే 25 సంవత్సరాలు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలంటే 25 సంవత్సరాలు వేచి చూడాలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ దెబ్బతో ఉలిక్కిపడిన బీజేపీ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాయి. మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ మీడియా సెల్ ఇన్ చార్జ్ శ్రీకాంత్ శర్మ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు.
సంప్రాదాయబద్ధమైన జీవితాన్ని, ప్రాచీన విలువలు కాపాడుకుంటున్న మన దేశంలో మార్పు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అమిత్ షా అన్నారని స్పష్టం చేశారు. అంతే కాని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న 25 సంవత్సరాలు పడుతుంది అని అమిత్ షా ఎక్కడా మాట్లాడలేదని గుర్తు చేశారు.
భారతదేశంలో అవినీతిని అంతం చెయ్యడానికి బీజేపీ శక్తి వంచనలేకుండ కృషి చేస్తున్నదని చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాలలో భారతదేశంలో భారీ ఉపాధి అవకాశాలు ఉంటాయని అమిత్ షా చెప్పారని శర్మ అన్నారు. వచ్చే 25 సంవత్సరాలలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని అమిత్ షా అన్నారని శ్రీకాంత్ శర్మ వివరించారు.