సంచలనం: అమిత్ షా హిందువు కాడా? జైనుడా? రాజ్ బబ్బర్ ఆరోపణ నిజమేనా?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేశారంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీ మరో ప్రచారం మొదలెట్టింది. అమిత్ షా తనకు తాను హిందువునని చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన జైన్ మతస్థుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్బబ్బర్ తాజాగా ఆరోపించారు.
ఎప్పుడూ తాను హిందూ కుటుంబంలో పుట్టానని, తన కుటుంబం సనాతన ధర్మాన్ని ఆచరిస్తోందని చెప్పుకునే అమిత్ షా మతంపై వార్తలు రావడం, చర్చలు జరగడం ఇదేం మొదటిసారి ఏమీ కాదు.
అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్చంద్ర షా అని, ఆయన 1964లో అక్టోబర్లో ముంబైలోని ధనవంతుడైన ఓ జైనుడి కుటుంబంలో పుట్టారని, ఆయన తండ్రిపేరు అనిల్ చంద్ర షా అని, గుజరాత్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అమిత్ షా కుటుంబం అక్కడే స్థిరపడిందని పలు పత్రికలు, వెబ్సైట్లు ఇదివరకే వెల్లడించాయి.
దాంతో జైన మతం కూడా హిందూ మతంలో భాగమని, రెండు మతాలు సనాతన ధర్మాలనే ఆచరిస్తాయంటూ అప్పట్లో అమిత్ షాను వెనకేసుకొచ్చిన అజ్ఞాన మేథావులు కూడా ఎంతో మంది ఉన్నారు.
నిజానికి హిందూ మతంతో పోలిస్తే జైన మతం చాలా ప్రాచీనమైనది, రెండు మతాల ఆచారాల మధ్య పోలికలున్నా రెండు మతాల ధర్మాలు మాత్రం ఒక్కటి కాదు. జైన మతంది శ్రామన ధర్మంకాగా, హిందూ మతానిది వేద ధర్మం.
ఎవరి ధర్మం ఏదైనా అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతాన్ని నమ్మకపోవడమూ, ఆచరించకపోవడమూ వ్యక్తిగతమే. మతాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదు. కానీ ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం, మతాన్నే మార్చడం మన రాజకీయ నాయకులకు మామూలై పోయింది.
తమ కుటుంబానికి ఆరాధ్య దైవం శివుడని, తన నానమ్మ ఇందిరాగాంధీ కూడా శివ పూజలు చేసేవారంటూ రాహుల్ గాంధీ చెప్పడమూ, అయినా దైవభక్తి అన్నది పూర్తిగా వ్యక్తిగత మైనదని, దాని గురించి మాట్లాడరాదంటూ రాహుల్ గాంధీ సర్దిచెప్పుకోవడమూ రాజకీయమే!
నిజంగా దైవభక్తి వ్యక్తిగత అంశమే అయితే ఇదివరకు ఎన్నడూ లేనంతగా గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపించిన గుడికల్లా రాహుల్ గాంధీ ఎందుకు వెళుతురనే విమర్శలూ వినిపిస్తున్నాయి.