బళ్లారి శ్రీరాములు స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో, ఈసీ నోటీసులు, గాలి బెయిల్, నకిలీవి, అమిత్ షా!
బెంగళూరు: స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలను ప్రసారం చెయ్యకూడదని భారత ఎన్నికల సంఘం టీవీ చానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీవీ చానల్స్ కు భారత ఎన్నికల సంఘం హెచ్చరించి నోటీసులు జారీ చేసింది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్
ఓబుళాపురం గనుల కేసు విషయం, అక్రమ గనుల కేసులో అప్పట్లో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్లుడితో ప్రస్తుత బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు తదితరులు డీల్ జరిపారని ఆరోపిస్తు గురువారం ఓ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో విడుదల అయ్యింది.
హోం మంత్రి ఆరోపణలు
ఓబుళాపురం గనుల కేసు విషయం, అక్రమ గనుల కేసులో అప్పట్లో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం బీజేపీ నాయకుడు బి. శ్రీరాములు డీల్ జరిపారని ఆరోపిస్తూ విడుదలైన వీడియో విషయంపై కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేష్ గుండూరావ్ మీడియా ముందు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీవీ చానల్స్ హంగామా
బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు తన స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం డీల్ జరిపారనే వీడియో అనేక టీవీ చానల్స్ లో ప్రసారం అయ్యింది. కొన్ని టీవీ చానల్స్ ఈ వీడియో విషయంలో పలు రాజకీయ పార్టీల నాయకులతో చర్చగోష్టి కార్యక్రమాలు నిర్వహించి ప్రసారం చేశాయి.
రచ్చరచ్చ అయ్యింది
టీవీ చానల్స్ చార్చగోష్టి కార్యక్రమాల్లో పాల్లొన్న పలువురు నేతులు శ్రీరాములు పోటీ చెయ్యకుండా అనర్హుడిని చెయ్యాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు ఈ వీడియో నకిలీదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కావాలనే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించారు.
బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు ప్రత్యారోపణలతో టీవీ చానల్స్ దద్దరిల్లాయి. ఈ విషయంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నికల ప్రచారం కిందకు వచ్చే అవకాశం ఉందని ఊహించిన భారత ఎన్నికల సంఘం స్ట్రింగ్ ఆపరేషన్ల వీడియోలు ప్రసారం చెయ్యరాదని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ టీవీ చానల్స్ కు నోటీసులు జారీ చేసింది.
నీచపు రాజకీయాలు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఓడిపోతామని భావించిన కాంగ్రెస్ పార్టీ నీచపు రాజకీయాలకు పాల్పపడుతోందని, నకిలీ వీడియోలు విడుదల చేసి మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. మే 15వ తేదీ సిద్దరామయ్య ప్రభుత్వం ఇంటికి పోతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుళ్లు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా విరుచుకుపడ్డారు.