బీజేపీ ప్రభుత్వం వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా
పాట్నా: బీహార్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్రంలోని ససరాం, షరీఫ్ పట్టణాల్లో చెలరేగిన అల్లర్లను జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయడంలో విఫలమైందని అన్నారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా అల్లర్లు చేసిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని స్పష్టం చేశారు.
నవడ జిల్లాలోని హిసౌలో జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ అభివృద్ధి కోసం, రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

దేశ ప్రజలు 2024 ఎన్నికల్లో గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ఆ స్థానంలో కూర్చేబెట్టాలని నిర్ణయించుకున్నారని అమిత్ షా చెప్పారు. మోడీ మరోసారి ప్రధాని అయితే.. ప్రధాని కావాలన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కలలు కల్లలు అవుతాయన్నారు. ఇక డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తానంటూ నితీష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటారన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ పొలిటికల్ అప్పీస్మెంట్ కారణంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తున్నారన్నారు. బీహార్ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కులా రాజకీయాలో చేస్తోందని మండిపడ్డారు. బీహార్ సీఎం నితీష్ ను మరోసారి బీజేపీ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. బీహార్ రాష్ట్రంలో నెలకొన్న అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే సరైన స్పందన లేదని.. తాను దేశ హోంమంత్రిని అని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకోవడం తన బాధ్యత అని అన్నారు.












Click it and Unblock the Notifications