ఎస్పీ హయాంలో బాహుబలులు-కానీ బీజేపీ హయాంలో భజరంగబలి-అమిత్ షా వ్యాఖ్యలు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా అంతే హోరాహోరీగా సాగిపోతోంది. ముఖ్యంగా బీజేపీ, ఎస్పీ మధ్య ముఖాముఖీ పోరు ఉందన్న అంచనాలతో ఇరు పార్టీల నేతలు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ప్రతాప్ ఘడ్ లోని రాణిగంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా సమాజ్ వాదీ పార్టీపై ఇదే కోవలో తీవ్ర విమర్శలు గుప్పించారు.
యూపీలో గతంలో సాగిన సమాజ్ వాదీ పార్టీ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలో బాహుబలులు ఉండే వారని, కానీ బీజేపీ పాలనలో భజరంగబలి మాత్రమే ఉన్నారని యోగీ ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్ హయాంలో శాంతి భద్రతల గురించి ప్రస్తావిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో బహుబలులు(గ్యాంగ్ స్టర్లు) ఉండేవారని, కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో భజరంగబలి (హనుమంతుడు) మాత్రమే ఉన్నాడంటూ యోగీ ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు.

యోగీ ఆదిత్యనాథ్ హయాంలో యూపీ నుంచి గూండాలు, గ్యాంగ్ స్టర్లు, మాఫియా డాన్ లను తరిమేశామని అమిత్ షా ఓటర్లకు గుర్తుచేశారు. ఇప్పుడు ఏ మాఫియా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా ? ఎవరైనా మీ భూములు కబ్జా చేస్తున్నారా ? తల్లులు, చెల్లెళ్ల మానాభిమానాల్ని అగౌర పరుస్తున్నారా అంటూ ఓటర్లను షా ప్రశ్నించారు. మీరు ఈసారి అఖిలేష్ కు ఓటేస్తే ముక్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్, ఆజం ఖాన్ వంటి నేరస్తులు జైళ్ల నుంచి బయటికి వస్తారంటూ ఓటర్లను అమిత్ షా హెచ్చరించారు. కాబట్టి వారిని జైళ్లలోనే ఉంచగల బీజేపీకే మరోసారి పట్టం గట్టాలని ఓటర్లను ఆయన కోరారు.












Click it and Unblock the Notifications