ఒవైసీపై హత్యాయత్నం: అమిత్ షా ఏం చెబుతారు: సర్వత్రా ఉత్కంఠత: తొలిసారి కేంద్రం వివరణ
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై చోటు చేసుకున్న హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో సచిన్ పండిట్, శుభమ్ అనే వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కారుపై బుల్లెట్లు..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీ వెళ్తోన్న అసదుద్దీన్ ఒవైసీపై ఈ నెల 3వ తేదీన కాల్పులు జరిగిన విషయంపై తెలిసిందే. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో హాపుర్ జిల్లా పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛజార్సీ టోల్ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది. సచిన్ పండిట్, శుభమ్ ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.

9 ఎంఎం పిస్టల్తో కాల్పులు..
వారిద్దరినీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. 9 ఎంఎం పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తరువాత కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఒవైసీకి జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. ఆరుమంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, 22 మంది ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేసింది. దీన్ని ఒవైసీ తిరస్కరించారు. లోక్సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణభయం లేదని, మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

అమిత్ షా ఏం చెబుతారు?
ధర్మసంసద్ ప్రసంగాల అనంతరం తనపై హత్యాయత్నం చోటు చేసుకుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా వివరణ ఇవ్వనుంది. పార్లమెంట్ సాక్షిగా స్పందించనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఓ ప్రకటన చేయనున్నారు. ఒవైసీ కారుపై చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై ఈ ఉదయం 11:30 గంటల సమయంలో రాజ్యసభలో, సాయంత్రం 4:30 గంటలకు రాజ్యసభలో ఆయన మాట్లాడనున్నారు.

రాజకీయ దుమారం..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో.. జాతీయ రహదారి మీద- ఓ లోక్సభ సభ్యుడిపై కాల్పులకు తెగబడిన ఘటన ఉత్తర ప్రదేశ్లో శాంతిభద్రతలు కరవు అయ్యాయడానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు భగ్గుమంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.

బీజేపీ కార్యకర్తగా..
ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన వారిలో ఒకడైన సచిన్ పండిట్ అనే వ్యక్తి.. భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్త కావడం రాజకీయంగా ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులను సృష్టించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో అమిత్ షా.. ఎలాంటి ప్రకటన చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఆయన చేసే ప్రకటనతో ప్రతిపక్ష సభ్యులు ఏకీభవిస్తారా? లేక దానిపై మళ్లీ ఉభయ సభల్లో ఆందోళన చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications