పురాణపండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక రచనను ఆవిష్కరించిన అమిత్ షా..
ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక 'ఆరాధన' పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన 'నన్నేలు నా స్వామి' పుస్తకాన్ని గురువారం(మార్చి 12)న ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తెలుగు రాకపోయినా.. ఆ పేజీలను అలా తిప్పుతుంటే ఏదో శక్తి తనను ఆవహిస్తోందన్నారు. హనుమద్భక్తులకు ఆత్మశక్తినిచ్ఛే ఈ గ్రంధాన్ని ఆంజనేయ స్వామి ఆశీర్వచనం వల్లే పురాణపండ శ్రీనివాస్ దీన్ని రాయగలిగారని అభిప్రాయపడ్డారు.
టాలీవుడ్ నిర్మాత సాయి కొర్రపాటి కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొదటి ప్రతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. పురాణపాండ శ్రీనివాస్ సామర్థ్యం, అసాధారణ ప్రతిభ, అసాధారణ రచనా శైలి, విశ్వసనీయత మరియు నిస్వార్థ సేవను గమనించి అంజనేయ స్వామిపై ఒక పుస్తకం రాయమని అభ్యర్థించినట్టుగా చెప్పారు. పురాణపండ శ్రీనివాస్ తీసుకొచ్చిన ఈ పుస్తకం ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అమిత్ షా వంటి గొప్ప వ్యక్తి ఈ పుస్తకాన్ని లాంచ్ చేసినందుకు నిజంగా సంతోషిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్, మరో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కార్యక్రమంలో పురాణపాండ శ్రీనివాస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పురాణపాండ శ్రీనివాస్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడిందని చెబుతారు. రాజీలేని మనస్తత్వం,కష్టపడే తత్వం,తిరుమల శ్రీవారి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యపడిందని ఆయన సన్నిహితులు చెబుతారు.