సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ: ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్ సంతకాలు
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆమెపై దాఖలైన పిటీషన్పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తమౌతోంది. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో అనిశ్చిత, అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్డీవాలా ఆదేశించారు.

సీజేఐకి లేఖ
దీనిపై పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్, మాజీ సైనికాధికారులు స్పందించారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. మొత్తంగా 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్స్, మరో 25 మంది సైనికాధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణకు పంపించారు.

ఎల్వీ, ఐవైఆర్ సహా..
ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, దినేష్ కుమార్, మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ కే అరవింద రావు, ఉమేష్ కుమార్ ఉన్నారు. తెలంగాణ క్యాడర్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ శ్రీవాస్తవ ఉన్నారు. నుపుర్ శర్మపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు.

పరిధిని దాటి..
దేశ ప్రజలకు దిగ్భ్రాంతికి గురిచేసినట్లుగా తాము భావిస్తున్నామని చెప్పారు. తన పరిధులను దాటి వారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందని అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల ఆదేశాలకు సమాంతరంగా న్యూస్ ఛానళ్లల్లో ప్రసారమైన వార్తలు గానీ, డిబేట్లు గానీ ఈ అంశాన్ని మరింత తీవ్రతరం చేశాయని చెప్పారు. దేశంలో చోటు చేసుకుంటోన్న అవాంఛనీయ సంఘటనలకు నుపుర్ శర్మ ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొనడం సహేతుకం కాదని అన్నారు.

జే అండ్ కే
ఆమె వ్యాఖ్యలను ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంతో ముడిపెట్టి చూడటం సరికాదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అండ్ లఢక్కు చెందిన ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ప్రతినిధులు కూడా వేరుగా సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. నుపుర్ శర్మపై వ్యాఖ్యలు చేసిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలా రోస్టర్లను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసేలా చర్యలు చేపట్టాలని సీజేఐని కోరారు.

లక్ష్మణ రేఖ దాటినట్టే..
నుపుర్ శర్మపై వ్యాఖ్యలు చేసిన విషయంలో జ్యుడీషియరీ వ్యవస్థ.. లక్ష్మణ రేఖను దాటినట్టే కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. దీనిపై తక్షణమే నష్ట నివారణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. జ్యుడీషియరీ ఆర్డర్లో ఇలాంటి వాటికి అవకాశం లేదని గుర్తు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాపై చర్యలను తీసుకోవడం ద్వారా దీన్ని సరిదిద్దడానికి అవకాశం ఉందని వారు సీజేఐ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications