రామ మందిరం ఎప్పుడో చెప్పాలి: శివసేన
ముంబై: అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదిని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను శివసేన ప్రశ్నించింది. మీరు రామ మందిరాన్ని నిర్మిస్తారని ఆశగా తాము ఎదురు చూస్తున్నామని గుర్తు చేసింది.
శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నా లో శనివారం ఈ అంశంపై సంపాదకీయం వ్రాసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని శివసేన చెప్పింది. తాను బ్రతికి ఉండగానే రామ మందిరాన్ని నిర్మిస్తానని మోహన్ భగవత్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే రామ మందిర నిర్మాణానికి ఒక తేది ప్రకటించాలని మనవి చేసింది. ఒక సారి నిర్మించిన ఆలయాన్ని మళ్లి మళ్లి నిర్మించాల్సిన అవసరం లేదని సామ్నా గుర్తు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి రామ మందిరం నిర్మించే ధైర్యం ఉందని అన్నారు.
ఈ విషయంలో నరేంద్ర మోడీ భాద్యత తీసుకున్నప్పుడే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతుందని శివసేన పేర్కొంది. అయితే మీరు ఇప్పుడు రామ మందిరం నిర్మించకుంటే మీ జీవితంలో ఇక్కెప్పుడూ ఆలయాన్ని నిర్మించలేరని, ఈ అంశానికి ముగింపు పలకాల్సిన అవసరం వచ్చిందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది.