నన్ను అక్బర్ రేప్ చేశారు: సంచలన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు పల్లవి గొగోయ్
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇంకా తగ్గలేదు. తాజాగా నేషనల్ పబ్లిక్ రేడియో ఛీఫ్ బిజినెస్ కరస్పాండెంట్ పల్లవి గొగోయ్ తనపై ఎంజే అక్బర్ అత్యాచారం చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసమయంలో తను ది ఏషియన్ ఏజ్ పత్రికలో పనిచేస్తోందని చెప్పారు. వాషింగ్టన్ పోస్టులో వచ్చిన కాలమ్లో ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించారు. అక్బర్ చేతిలో తను ఏరకంగా మోసపోయిందో గుర్తు చేసుకుంటా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన వయస్సు 22 ఏళ్లుగా చెప్పారు.
1994లో నన్ను అక్బర్ ముద్దు పెట్టే ప్రయత్నం చేశారు
అక్బర్ వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఆయన లాయర్ సందీప్ కపూర్ అన్నారు. ఇదే విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ కూడా తన కాలమ్లో రాసింది. 23 ఏళ్లకు తను ఏషియన్ ఏజ్ పత్రికలో ఆప్ఎడ్ పేజ్ ఎడిటర్ అయినట్లు గొగోయ్ తెలిపారు. ఆ వయసుకు తను చాలా పెద్ద బాధ్యతే నిర్వర్తించినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే తాను ఎంతో ఇష్టంగా చేస్తున్న ఉద్యోగంలో కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తాను భావించినట్లు చెప్పారు.
అక్బర్ తమపై గట్టిగా కేక వేసిన రోజంటూ లేదని ఆమె చెప్పారు. తను వాడే పదజాలంను తలుచుకుని చాలా బాధపడేదాన్ని అని ఆమె చెప్పారు. తొలిసారిగా తనపై అక్బర్ లైంగిక దాడికి పాల్పడిన రోజును ఆమె గుర్తుచేసుకున్నారు. 1994 వేసవి కాలంలో ఒక రోజు ఆఫీసుకు వెళ్లినట్లు చెప్పారు. అక్బర్ ఎప్పుడూ తలుపు వేసుకుంటారని చెప్పారు. హెడ్లైన్స్ చూపించేందుకు అక్బర్ దగ్గరకు వెళితే తన పనితనాన్ని మెచ్చుకుంటూ వెంటనే కుర్చీలోనుంచి లేచి తనను దగ్గరకు తీసుకుని ముద్ద పెట్టే ప్రయత్నం చేశారని గొగోయ్ తెలిపారు. అయితే ఈ ఘటనను తలుచుకుని ఒకలాంటి ఆవేదనకు గురైనట్లు తెలిపారు గొగోయ్. అసలు అక్బర్ తనను ఏంచేయాలనుకున్నారని చాలారోజులు మదనపడ్డట్లు ఆమె తెలిపారు.
తాజ్హోటల్లో కూడా లైంగికంగా దాడి చేశారు
ఇక రెండో ఘటన ముంబైలో చోటుచేసుకుందని గుర్తుచేశారు. ఓ సారి తాజ్హోటల్కు రావాల్సిందిగా అక్బర్ కోరారని గొగోయ్ గుర్తుచేసుకుంది. తాజ్హోటల్లో తాను ఉంటున్న గదికి వెళ్లగానే మరోసారి దగ్గరకు లాక్కుని ముద్దుపెట్టే ప్రయత్నం చేశారని చెప్పింది. అయితే ఈసారి తనను దూరంగా తోసేసి అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లు ఆమె వివరించారు. అక్బర్ తన ముఖాన్ని రక్కినట్లు ఆమె చెప్పారు. ఇక తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి తనపై అత్యాచారం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు గొగోయ్.
జైపూర్ హోటల్ గదిలో అత్యాచారం చేశారు
ఉద్యోగరీత్యా ఓ పనిమీద జైపూర్కు వెళ్లిన సమయంలో అక్కడ ఓ హోటల్ గదిలో ఉన్నట్లు తెలిపారు. అక్కడ కూడా అక్బర్ తన కోరికను తీర్చాల్సిందిగా కోరాడని ఇందుకు ప్రతిఘటించడంతో అక్బర్ ఆయన బలాన్ని ప్రయోగించి గొగోయ్ వంటిపై ఉన్న వస్త్రాలను తొలగించి అత్యాచారం చేశాడని చెప్పింది. అయితే జరిగిన ఘటనపై పోలీసులకు చెప్పేందుకు వెనకాడినట్లు చెప్పారు. తన పరువు పోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పోలీసులకే కాదు ఈ ఘటన గురించి ఎక్కడా నోరు విప్పలేదని చెప్పారు. ఒకవేళ చెప్పినా ఎవరు నమ్ముతారు అని అనుకొన్నట్లు ఆమె వెల్లడించారు. అసలు హోటల్ గదికి వెళ్లడం తనదే తప్పుఅని చెప్పి సరిపెట్టుకున్నట్లు పల్లవి గొగోయ్ చెప్పారు.
అక్బర్కు అనుమానం ఎక్కువ...లండన్ ఆఫీసులో భౌతిక దాడి చేశారు
ఇది ఇక్కడితో ఆగిపోలేదని తరుచూ తన కోరిక తీర్చమని వేధించే వాడని ఆమె చెప్పారు. కొన్ని నెలల వరకు తనపై పరుషపదజాలంతో పాటు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారని వెల్లడించారు. అంతేకాదు ఆఫీసులో తన వయసున్న పురుష ఉద్యోగులతో మాట్లాడితే తనపై గట్టిగా అరిచేవాడని చెప్పారు. తను లండన్ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో లండన్కు వచ్చిన అక్బర్ తనపై దాడిచేశారని చెప్పారు. డెస్క్పై ఉన్న కత్తెర, పేపర్ వెయిట్తో తనపై దాడి చేసినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక ఏషియన్ ఏజ్లో ఉద్యోగం మానేసే ముందు జరిగిన చివరి ఘటనగా పల్లవిగొగోయ్ చెప్పారు.