యుపి: చెట్టుకు వేలాడుతూ మరో బాలిక, రేప్?
సీతాపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. అమ్మాయిలపై దాష్టీకాలకు వరుసగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సితాపూర్ జిల్లా మస్రిఖ్ ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయి శవం చెట్టుకూ వేలాడుతూ కనిపించింది.
సోమవారం రాత్రి నుంచి ఆ బాలిక కనిపించడం లేదు. ఆ తర్వాత మంగళవారం ఉదయం ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగి ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు.
అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు పెట్టారు. పొరుగున ఉండే వ్యక్తితో పాటు అతని ముగ్గురు కుమారులపై అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశాడు.
నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను మీడియా ఎక్కువ చూసి చూపిస్తోందని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గుర్రుమంటున్నారు. కానీ సంఘటనలు మాత్రం ఆగడం లేదు.