అసాంఘీక శక్తులు జల్లికట్టును హింసాత్మకంగా మార్చాయి: పన్నీర్ సెల్వం
జల్లికట్టు ఆందోళన అదుపు తప్పి హింసాత్మకంగా మారుతుండటంతోనే సాధ్యమైనంత తక్కువ స్థాయిలో బలప్రయోగం చేసి ఉద్రిక్తతలను అదుపు చేయాల్సి వచ్చిందని పన్నీర్ చెప్పుకొచ్చారు.
చెన్నై: జల్లికట్టు ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో.. పోలీసు వర్గాలు తమ లాఠీలకు పనిచెప్పడం.. ఆందోళనకారులు వారిమీదకు రాళ్లు రువ్వడం.. వంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
పోలీసులను ప్రయోగించడం పట్ల ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకె స్టాలిన్ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. జల్లికట్టు ఆందోళన కార్యక్రమాలకు హింసాత్మక ముగింపు ఇవ్వడం పట్ల ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం దీనిపై స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను పన్నీర్ సమర్థించారు.

జల్లికట్టు ఆందోళన అదుపు తప్పి హింసాత్మకంగా మారుతుండటంతోనే సాధ్యమైనంత తక్కువ స్థాయిలో బలప్రయోగం చేసి ఉద్రిక్తతలను అదుపు చేయాల్సి వచ్చిందని పన్నీర్ చెప్పుకొచ్చారు. జల్లికట్టు ఆందోళనకారులు తొలుత దానిపై నిషేధం ఎత్తివేయాలని కోరారని, ఆ తర్వాత క్షణ క్షణం తమ నిర్ణయం మార్చుకుంటూ వచ్చారని అందువల్లే ప్రభుత్వానికి దానిపై స్పందించడం కష్టంగా మారిందని వివరణ ఇచ్చారు.
ఆందోళనకారులు నిరసనను ఉపసంహరించుకున్నప్పటికీ.. అసాంఘీక శక్తులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డాయని పన్నీర్ చెప్పారు. పోలీసులు చాలావరకు సంయమనం పాటించినప్పటికీ.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తక్కువ స్థాయిలో పోలీసు బలప్రయోగం చేయాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications