అస్సాంలోనూ వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలు, పోలీసులపైకి రాళ్లు
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన అస్సాంలోనూ వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. అసోంలోని సిల్చార్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులపై రాళ్ల దాడులకు దిగారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిల్చార్లో వందలాది మంది నిరసనలు చేపట్టారు. ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ సిల్చార్లోని బెరెంగా ప్రాంతంలో 300-400 మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. రోడ్లను దిగ్భంధించి నిరసన చేపట్టారు. నిరసనకారులు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులను రోడ్లపైనుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.
అసోం రాష్ట్రంలోని చమ్రగుడం, బెరెంగా, పాత లఖిపూర్ రోడ్ ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
బెంగాల్లో హిందువులపై దాడులు
వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. హిందువులకు చెందిన షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు నిరసనకారులు దొంగతనాలకు తెగబడ్డారు.
ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా, వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రమైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో 110 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జంగీపూర్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని కోల్కతా హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ముర్షిదాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేంద్ర బలగాలు (సీఏపీఎఫ్) మోహరించి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాయి.
వక్ఫ్ చట్టం అమలు చేయబోమంటున్న మమత
బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయం తీసుకుంది కాబట్టి.. కేంద్రంతోనే ఆందోళనకారులు తేల్చుకోవాలని మమత సూచించడం గమనార్హం.












Click it and Unblock the Notifications