అంటీలియా కుట్ర- ముంబై క్రైమ్ బ్రాంచ్లో ప్రకంపనలు-భారీగా బదిలీలు
ముంబైలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటీలియా వద్ద పేలుడు పదార్దాలున్న ఎస్వీయూను ఉంచిన కేసు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారుల పేర్లు మీడియాలో రావడం, ప్రజల్లోనూ విమర్శలు మొదలు కావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్లో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి.
అంటీలియా కుట్ర కేసులో అనుమానితుడిగా అరెస్టైన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేకు సహచరులైన ఇద్దరు పోలీసు అధికారులపై తాజాగా బదిలీ వేటు పడింది. వాజేకు సన్నిహితులుగా భావిస్తున్న అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్లు రియాజుద్దీన్ కాజీ, ప్రకాష్ హోవల్పై బదిలీ వేటు వేశారు. రియాజుద్దీన్ను స్ధానిక ఆయుధాల యూనిట్కు, ప్రకాష్ హోవల్ను మలబార్ హిల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇప్పటికే ఎన్ఐఏ వీరిద్దరినీ ఈ కేసులో పలుమార్లు విచారించింది.
Recommended Video
అంటీలియా కేసు దర్యాప్తులో భాగంగా విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై క్రైమ్ బ్రాంచ్లో దాదాపు 30 ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. వీరితో పాటు16 మంది అసిస్టింట్ పోలీసు ఇన్స్పెక్టర్లనూ తప్పించారు. మరో 19 మంది ఇతర సిబ్బందినీ బదిలీ చేశారు. వీరందరినీ వివిధ పోలీసు స్టేషన్లు, ఆయుధాల యూనిట్లు, స్పెషల్ బ్రాంచ్కూ పంపారు. దీంతో ఈ బదిలీల వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో చాలా మంది అంటీలియా కేసులో ఎన్ఐఏ అనుమానిస్తున్న వారే కావడం విశేషం.