బందరు టెక్కీ అనూహ్య రేప్, హత్య: చార్జిషీట్ దాఖలు
ముంబై: ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా టెక్కీ అనూహ్య హత్యకేసులో ముంబై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మచిలీపట్నానికి చెందిన ఆమెపై గత జనవరిలో అత్యాచారం చేసి, హత్యచేశారు. ఈ కేసులో ఏకైక నిందితుడు చంద్రభాను సూదం సనప్పై 542 పేజీల చార్జిషీటు నమోదు చేసి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. తొలుత రైల్వే పోర్టర్ అయిన సనప్ అనంతరం నాసిక్లో డ్రైవర్గా పని చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. హత్య, అత్యాచారం, సాక్ష్యాలు లేకుండా చేశారనే అభియోగాలను అతనిపై మోపారు.
ఆంధ్రప్రదేశ్లోని బందరుకు చెందిన అనూహ్య ముంబైలోని టిసిఎస్లో పనిచేస్తూ ముంబైలోని అంథేరీలో ఉండేది. క్రిస్మస్ పండుగకు నిరుడు డిసెంబర్ 22వ తేదీన మచిలీపట్నం వచ్చిన అనూహ్య ఈ ఏడాది జనవరి 5వ తేదీన ముంబై చేరుకుంది. ఆమె ముంబైలోని ఎల్ఎఎల్టి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె శవం జనవరి 16వ తేదీన భందుప్ (తూర్పు)లోని టాటా నగర్ పొదల్లో కనిపించింది.
టెర్మినస్లోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చంద్రభాన్ సనప్ను అరెస్టు చేశారు. నాసిక్కు చెందిన సనప్ అనూహ్యను ఇంటి వద్ద దింపుతానని చెప్పి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారు. మరణించిన తర్వాత చాలా రోజులకు శవం లభించడంతో ఫోరెన్సిక్ పరీక్షల్లో డిఎన్ఎ నమూనాలు మాయమై ఉండవచ్చునని, అది కేసుపై ఏ విధమైన ప్రభావం చూపదని దర్యాప్తు అధికారులు అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
సనప్ మిత్రుడు నందకిశోర్ సాహు సాక్ష్యం తమకు ఈ కేసులో పనికి వస్తుందని, నేరం చేయడానికి సనప్ అతని బైక్ వాడాడని అంటున్నారు. సనప్ సోదరి ఇంట్లో అతని దుస్తులు కూడా దొరికాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. అమ్మాయి అతనికి కలిసి నడుస్తున్న సిసిటివీ ఫుటేజ్ కూడా ఉందని చెబుతున్నారు.