సిద్ధూ సీరియస్: డీఎస్పీ అనుపమ వివాదానికి తెర
న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షనాయ్ వివాదానికి తెర పడింది. ఆమె పంపిన రాజీమానా లేఖను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్లు గురువారం రాత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు.
అనుపమ నిజాయితీ గల ఆఫీసర్ అని, రాజీనామాకు తొందపడకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా చూడాలని గురువారం వరకు సూచించిన సీఎం సిద్ధరామయ్య సాయంత్రం ఆమెపై మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని, చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.
చంపితే దయ్యమై వస్తా: డిఎస్పీ అనుపమ స్టోరీ ట్విస్ట్ సిద్ధరామయ్య ఈ విధంగా మాట్లాడిన తర్వాతే ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించడం విశేషం. 'వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశాను. దీని వెనుక వేరే ఉద్దేశం లేదు. ఫేస్బుక్లో నాకు ఖాతా లేదు. నా పేరున ఏయే వ్యాఖ్యలు ఉన్నాయో, ఎవరు పెట్టారో, వాటితో నాకు సంబంధం లేద'ని అనుమప స్పష్టం చేశారు.
గురువారం ఉదయం ఆమె కూడ్గికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానంపై నమ్మకం ఉందని, న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన స్నేహితురాలి ఇంట్లోనే ఉన్న తాను వస్తువులు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
డీఎస్పీ అనుపమ రిజైన్, ఫేస్బుక్లో కామెంట్స్: ఏం జరిగింది?
గురువారం ఉదయం అనుపమ రాజీనామాను ఆమోదించవద్దని, ఆమెతో మాట్లాడి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా చూడాలని సిద్ధరామయ్య డిజిపి ఓం ప్రకాష్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి డీఎస్పీ పాటిల్, సండూరు సీఐ మల్లేష్ దొడ్డమని తదితర పోలీసు అధికారులు ఆమె ఇంటికి వెళ్లి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తన కార్యాలయంలోని వ్యక్తిగత పత్రాలు, సామగ్రి తదితర వాటిని సర్దుకొని సోదరుడు అచ్యుత్, సోదరితో కలిసి ప్రైవేట్ వాహనంలో సొంతూరు భట్కల్కు వెళ్లిపోయారు. అనుపమ షెనాయ్ రాజీనామాను ఆమోదించవద్దంటూ కూడ్లిగి పోలీస్స్టేషన్, ప్రధాన కూడలిలో పలువురు ఆందోళన చేపట్టారు.