బీజేపీ విద్వేష వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మకు నోటీసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ''సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తోన్న దేశద్రోహుల్ని కాల్చిపారేయండి..''అంటూ నినాదాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ఈసీ మంగళవారం నోటీసులు జారీచేసింది. గడువులోగా సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని తెలిపింది.
మరో ఎంపీకి కూడా
ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే షాహీన్ బాగ్ ధర్నా చౌక్ ను గంటలో ఖాళీ చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను కూడా ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈమేరకు రంగంలోకి దిగింది.
పెనుదుమారం
కేంద్ర ఆర్థిక శాక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ఓ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఏఏ వ్యతిరేక నిరసన కారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ్ కే గద్దారోంకో.. గోలీమారో సాలోంకో..‘‘ అని జనం చేతా నినాదాలు చేయించారు. ఒక కేంద్రమంత్రి ఈరకమైన కామెంట్లు చేయడం పెనుదుమారానికి దారితీసింది. అంతలోనే ఢిల్లీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ మంగళవారం ఒక సభలో మాట్లాడుతూ.. హిందువులను ముస్లింలు వేధిస్తున్నారని, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే గంటలోపే షాహీన్ బాగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయిస్తామని అన్నారు.
బీజేపీ సమర్థన..
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ సర్వేశ్ వర్మకు సొంత పార్టీ బీజేపీ నేతలు అండగా నిలిచారు. దేశద్రోహులను కాల్చిపారేయాలన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తానని, ఆయనన్నదాంట్లో తప్పేమీ లేదని కర్నాటక మంత్రి సీటీ రవి చెప్పడం గమనార్హం. పలు రాష్ట్రాల్లో ఇంకొందరు బీజేపీ నేతలు కూడా ఇదేరకమైన కామెంట్లు చేశారు.