వైఎస్ జగన్ సహా దావోస్ సదస్సుకు వెళ్లే లిస్ట్లో ముఖ్యమంత్రులు, వారి వారసులు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్లోని దావోస్లో వచ్చేనెల ఏర్పాటు కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలు బారులు తీరుతున్నారు. భారత్ నుంచి వంద మందికి పైగా వేర్వేరు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలకు చెందిన ముఖ్య కార్యనిర్వహణాధికారులు దీనికి హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా దావోస్కు వెళ్లనున్నారు.
మే 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్లో ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోర్ వార్షిక సదస్సు ఏర్పాటు కానుంది. ప్రతి సంవత్సరం దావోస్లో ఈ భేటీ ఏర్పాటు కావడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా రెండు సంవత్సరాలు ఈ అత్యుత్తమ సమ్మిట్ నిర్వహించలేకపోయింది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో చేపట్టింది. ఇప్పుడా పరిస్థితులు లేవు. కరోనా వైరస్ తీవ్రత ఇదివరకట్లా ఉండట్లేదు. దీనితో ఈ సమ్మిట్ను ఫోరం పునరుద్ధరించింది.
ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన సీఈఓ, సీఓఓ, సీఎఫ్ఓలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. దాదాపుగా 400కు పైగా సెషన్లను ఇందులో నిర్వహించనున్నట్లు ఫోరం తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో వేర్వేరు రంగాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొంది. రెండు వేల మందికి పైగా వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, పారిశ్రామికవేత్తలు, జీ7 కూటముల సభ్య దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు.
భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు దీనికి హాజరు కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థికం, పెట్టుబడుల శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే దావోస్కు వెళ్లనున్నారు. కేటీఆర్, ఆదిత్య థాకరే.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారసులు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ గౌతమ్ అదాని దీనికి హాజరు కానున్నారు. అంబానీ కూతురు, కుమారుడు ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, సీరమ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా దావోస్ సదస్సుకు హాజరు కావడం ఖాయమైంది.