పిస్తోల్తో బెదిరించి.. దర్జాగా కూర్చుని.. ఎలా దోచారంటే (వైరల్ వీడియో)
ఢిల్లీ : దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈజీమనీకి అలవాటుపడుతూ చోరీలనే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జనాల భయాన్ని ఆసరాగా చేసుకుని మరణాయుధాలతో తెగబడుతూ అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఆ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలోని ఓఖ్లా ఇండస్ట్రియల్ సమీపంలోని శివారు ప్రాంతమైన సరాయి జులెనా ఏరియాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పిస్తోల్ వెంట తెచ్చుకున్న ముగ్గురు దుండగులు ఓ ఫార్మసీ షాపులోకి చొరబడి అక్కడున్నవారిని భయాందోళనకు గురిచేశారు. అనంతరం క్యాష్ కౌంటర్లో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు. అందులో ఒకడు అక్కడున్న కుర్చీని కాలితో తన్ని తనవైపు తిప్పుకుని దర్జాగా కూర్చుంటే.. మరో ఇద్దరు చోరీ తంతు కానిచ్చారు.

మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. ఆ ముగ్గురు దుండగుల్లో ఒకడు వెళుతూ వెళుతూ మరోసారి పిస్తోల్ చూపి షాపులో ఉన్నవారిని భయపెట్టాడు. పిస్తోల్ ఎక్కుపెట్టి వారి వైపు గురిచూసి కాల్చినట్లు యాక్షన్ చేయడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఒక్కసారిగా కిందకు వంగిపోయారు. అదలావుంటే షాపు యజమాని ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ టీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
#WATCH Three armed robbers stormed inside and stole cash from a chemist shop in Sarai Jullena village, Okhla, early morning today. pic.twitter.com/PJXAm1Kno8
— ANI (@ANI) July 2, 2019












Click it and Unblock the Notifications