రూ.50కోట్లు ఇవ్వకపోతే మమతా బెనర్జీని చంపేస్తాం!: జైషే మహమ్మద్
రూ.50కోట్లు ఇవ్వకపోతే పశ్చిమ్ బంగా సీఎం మమతా బెనర్జీని చంపేస్తామని పేర్కొంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరిట రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ అందింది.
కోల్కతా: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరిట సోమవారం నాడు తూర్పు రైల్వే అధికారులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. రూ.50కోట్లు ఇవ్వకపోతే పశ్చిమ్ బంగా సీఎం మమతా బెనర్జీని హత్య చేయడంతో పాటు హౌరా రైల్వే స్టేషన్ ను పేల్చి వేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు.
తనను జైషే మహమ్మద్ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఓ వ్యక్తి ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అడిగినంత డబ్బు ఇవ్వని పక్షంలో హౌరా రైల్వే స్టేషన్ ను పేల్చేసి లక్షలామంది ప్రజల ప్రాణాలు బలగొంటామని నిందితుడు లేఖలో తెలిపాడు.
కాగా, సదరు నిందితుడి నుంచి వచ్చిన లేఖలో.. ఎస్సి దాస్ అనే దూరదర్శన్ మాజీ ఉద్యోగి పేరు సంతకం స్థానంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తలదాచుకునేందుకు దాస్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారని లేఖలో రాసి ఉండటం గమనార్హం. బెదిరింపు లేఖను రైల్వే శాఖ వారు పోలీసులకు అందజేయడంతో.. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు ప్రారంభమైంది.
బెదిరింపు లేఖలో రాసిన ఫోన్ నంబర్, అడ్రస్ ఆధారంగా తనిఖీలు చేయగా.. అవి తప్పుడు వివరాలుగా తేలినట్టు తూర్పు రైల్వే సీపీఆర్వో ఆర్యన్ మహాపాత్ర వెల్లడించారు. బెదిరింపు లేఖతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ప్రస్తుతం హౌరా స్టేషన్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేసింది.