అరెస్టైన ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ జైల్లో కుప్పకూలారు: ఆస్పత్రికి తరలింపు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతి ఆరోపణల కేసులో ముంబైలోని ఆర్థర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన జైలులోనే కుప్పకూలారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా కేంద్ర ఏజెన్సీలు దేశ్ముఖ్పై అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో కేసులు నమోదు చేశాయి.
ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ్ముఖ్ కుప్పకూలడం, ఛాతీలో నొప్పి రావడంతో అతన్ని జేజే ఆసుపత్రికి తరలించారు. ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న దేశ్ముఖ్కు తల తిరగడంతో స్పృహతప్పి పడిపోయారని జైలు అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
అనిల్ దేశ్ముఖ్ రక్తపోటు పెరిగిందని, ఈసీజీ నివేదిక అసాధారణంగా ఉందని కనుగొనబడింది. దేశ్ముఖ్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సదరు అధికారి తెలిపారు.
దేశ్ముఖ్ నవంబర్ 2021 నుంచి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. రూ. 100 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి దేశ్ముఖ్, అతని ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
జులై నెలలో, ఊపిరితిత్తులు, వెన్నెముక రుగ్మతలతో సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొంటూ బాంబే హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. దేశ్ముఖ్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదిస్తూ.. తన క్లయింట్ ఆరోగ్యం క్షీణించడం వల్ల అతనికి ప్రమాదం ఉందని అని అన్నారు.
సీబీఐ దర్యాప్తుతో పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో మనీలాండరింగ్ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఈడీ ప్రకారం.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వంలో మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో, దేశ్ముఖ్ ముంబై పోలీసు అధికారులతో సహా, టాప్ కాప్ సచిన్ వాజ్తో సహా నగరం, చుట్టుపక్కల రెస్టారెంట్లు, బార్ యజమానుల నుంచి నెలవారీగా డబ్బు వసూలు చేయాలని ఆదేశించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ప్రత్యేక కోర్టు ఈ ఏడాది మార్చిలో 72 ఏళ్ల ఈ నాయకుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ 2021 మార్చి 30న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు రాసిన లేఖలో దేశ్ముఖ్పై ఆరోపణలు చేశారు. ఇది భారీ రాజకీయ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
దేశ్ముఖ్ కేసుతో సంబంధం ఉన్న నిందితుల్లో ఒకరైన, మన్సుఖ్ హిరాన్ హత్య కేసుకు సంబంధించి అరెస్టయిన, డిస్మిస్డ్ కాప్ సచిన్ వాజ్ ఇటీవల సీబీఐకి అప్రూవర్గా మారారు.
జూన్లో, దోపిడీ కేసుకు సంబంధించి దాఖలు చేసిన 49 పేజీల ఛార్జిషీట్లో సీబీఐ వాజ్ను అప్రూవర్గా చూపింది. పరమ్ బీర్ సింగ్ని బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెలా 100 కోట్లు వసూలు చేయమని దేశ్ముఖ్ బలవంతం చేశారని ఆరోపించారు.
పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించిన తర్వాత సింగ్ ఈ ఆరోపణలు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ దేశ్ముఖ్ ఖండించారు.