కేజ్రీపై జైట్లీ రూ.10 కోట్ల దావా, సిడి బయటపెట్టిన కీర్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. డీడీసీఏలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలింగిందని జైట్లీ దావాలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ తన కుటుంబసభ్యులపై కూడా ఆరోపణలు చేస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతిపై ఏఏపీ సర్కార్ విచారణ కమిషన్ను నియమించింది. దీంతో జైట్లీ దావా వేశారు. మరోవైపు, డిడిసిఎలో అవకతవకలు నిజమేనని మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్ ఆరోపించారు.
జైట్లీకి మాత్రం పలువురు క్రికెటర్లు మద్దతు పలికారు. ఢిల్లీ దేశ రాజధానిలో క్రికెట్ వివాదం కొద్ది రోజులుగా కీలక మలుపులు తిరుగుతోంది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢీ అంటే ఢీ అన్నారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించినట్లు ఏఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరో ఐదుగురిపై సోమవారం పరువునష్టం దావా వేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో అవినీతి జరిగిందంటూ జైట్లీపై సొంతపార్టీ బిజెపికే చెందిన ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
డీడీసీఏలో అవినీతిపై ఈడీ, డీఆర్ఐతో దర్యాప్తు జరిపించాలని కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ 28 నిమిషాల వీడియోను కూడా ఆయన విడుదల చేశారు.
జైట్లీ హయాంలో డీడీసీఏ చెల్లింపులు చేసిన 14 కంపెనీలకు చిరునామాలే లేవని వీడియో చెబుతోంది. రికార్డుల్లో కంపెనీలు పేర్కొన్న చిరునామాలకు వెళ్లినప్పుడు అవి కనిపించలేదని పేర్కొంది. రూ.కోట్ల పనులను మోసపూరిత కంపెనీలకు ఇచ్చారని, ఆ పనుల వివరాలను వెల్లడించలేదని, అవినీతి జరిగిందని, తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్ఎఫ్ఐవో) కూడా అవకతవకలు జరిగాయని తెలిపిందని ఆజాద్ పేర్కొన్నారు.
లాప్టాప్ను రోజుకు రూ.16వేలకు, ప్రింటర్ను రూ.3వేలు, పూజకు వాడే పళ్లేన్ని రూ.5వేలకు అద్దెకు తెచ్చారని వీడియోలో ఉంది. 2011-12 నాటి డీడీసీఏ వార్షిక సమావేశం తాలూకు దృశ్యాలు ఉన్నాయి. అధ్యక్ష స్థానంలో కూర్చున్న జైట్లీని ఆజాద్ ప్రశ్నిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
తాను అవినీతిపై పోరు సాగిస్తున్నానని, దీనిని వ్యక్తుల మధ్య పోరుగా చిత్రీకరించవద్దని కీర్తి ఆజాద్ కోరారు. డీడీసీఏలో అవినీతి జరుగుతోందని మాత్రమే తొమ్మిదేళ్లుగా చెబుతూ వచ్చానని, దేశంలోపల, వెలుపల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హీరో అని ఆజాద్ పేర్కొన్నారు.
నేను డిడిసిఏ అవినీతిపై తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నానని, కొత్తగా వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే దానిని ఇప్పుడు రాజకీయ అంశంగా మార్చిందని కేజ్రీవాల్కు చురక అంటించారు. కాగా, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ వంటి వారు అండగా నిలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా అండగా నిలిచారు.
జైట్లీ పిటిషన్ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా
డిడిసిఎ స్కాం ఆరోపణల నేపథఅయంలో జైట్లీ రూ.పది కోట్ల పరువు నష్టం దావా వేశారు. జైట్లీ పిటిషన్ పైన విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా పడింది. తన పైన నిరాధారమైన ఆరోపణలు చేశారని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.