'జైట్లీ' ఫోన్ రాయబారం!?: పాండ్యరాజన్ పన్నీర్ గూటికి చేరడం వెనక..
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ జోక్యంతోనే పాండ్యరాజన్ పన్నీర్ గూటి వైపు మళ్లారన్న ఆరోపణ పలువురి నుంచి వ్యక్తమవుతోంది.
చెన్నై: పన్నీర్ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ ఇంతలా దూకుడు ప్రదర్శించిన దాఖలా లేదు. పగ్గాలు శశికళ చేతుల్లోకి వెళ్లిపోయే తరుణంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగిరేశారు. అయితే అది ఆయన సొంత నిర్ణయం కాదని, ఎవరో ఆయన్ను వెనక ఉండి నడిపిస్తున్నారని శశికళ వర్గం ఆరోపిస్తోంది.
ఏదేమైనా క్రమక్రమంగా పన్నీర్ బలం పుంజుకుంటూ శశికళకు చెక్ పెట్టే దిశగా కదులుతున్నారు. అయితే ఆయన బలం పుంజుకోవడం వెనుక కేంద్రం సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా శశికళ శిబిరం నుంచి ప్లేటు ఫిరాయించిన మాఫోయ్ పాండ్యరాజన్ విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ జోక్యంతోనే పాండ్యరాజన్ పన్నీర్ గూటి వైపు మళ్లారన్న ఆరోపణ పలువురి నుంచి వ్యక్తమవుతోంది. పాండ్య రాజన్ పన్నీర్ గూటి వైపు మొగ్గేందుకు జైట్లీ ఫోన్ ద్వారా రాయబారం నెరిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పన్నీర్ కు సహకరించాల్సిందిగా జైట్లీ ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద జైట్లీ ప్రోద్బలంతోనే పాండ్యరాజన్ శశికళ శిబిరాన్ని వీడి పన్నీర్ చెంతకు చేరారని చెప్పుకుంటున్నారు.
కాగా, తన శిబిరంలో కీలకంగా వ్యవహరించిన విద్యాశాఖామంత్రి మాఫోయ్ పాండ్యరాజన్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడం శశికళకు ఊహించని షాక్ ఇచ్చినట్టయింది. నిజానికి పాండ్యరాజన్ ను మంత్రివర్గంలోకి తీసుకునే సమయంలోను శశికళ ఆయనకు మద్దతుగా నిలిచారని చెబుతారు.
రెండేళ్ల క్రితం ఆయన డీఎంకే గూటిని వీడి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
ఆ తర్వాత ఆయనకు సీటివ్వడమే గాక మంత్రిని కూడా చేశారు జయలలిత. మంత్రిగా నియమించబడ్డ సమయంలో శశికళకు ఆయనకు సహకరించారు. అదే కృతజ్ఞతతో తొలుత పాండ్యరాజన్ శశికళకు అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications