కేసీఆర్లాగే మోడీ గెలుస్తారు!: తెలంగాణలో చంద్రబాబు-రాహుల్ కూటమిని లాగిన జైట్లీ
న్యూఢిల్లీ: ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
'దాంతో 2019 ఏపీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి, జగన్తో ఎలా ఉండాలో కేసీఆర్కు తెలుసు'
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలో ఉండటం గమనార్హం. మిజోరాంను కాంగ్రెస్ చేజార్చుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, కాంగ్రెస్లకు తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీ కలిసినా ఫలితం లేకుండా పోయింది.
తెలంగాణ కూటమికి, జాతీయ కూటమికి లంకె
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన తీసుకు వచ్చారు. తెలంగాణలో ఏర్పడిన కూటమికి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతత్వంలో చంద్రబాబు, రాహుల్ గాంధీ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పడుతున్న మహాకూటమికి లంకె పెట్టారు. ప్రస్తుతం బీజేపీ, బీజేపీయేతర కూటములు మాత్రమే ఉన్నాయని రాహుల్ గాంధీ, చంద్రబాబు వంటి నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ఫలితాలే లోకసభ ఎన్నికల్లో
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిపై జైట్లీ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలది విఫలమైన ఆలోచన అన్నారు. అందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణలో ఇటువంటి మహాకూటమే ఏర్పాటై టీఆర్ఎస్ పైన పోటీ చేసిందని, తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తులకు జరిగిన పోటీ ఇది అని, ప్రతిపక్షాలు అన్నీ కలిసి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనుకుని విఫలమయ్యాయని చెప్పారు. ఇలాంటి ఫలితమే లోకసభ ఎన్నికల్లోనూ వస్తుందన్నారు. భిన్నమైన భావజాలాలు కలిగిన పార్టీలన్నీ కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
వారిలోనే రెండు ఆలోచనలు
కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే మహాకూటమి అనేది భారత్ను భయపెట్టే ఆలోచన అని జైట్లీ అన్నారు. దానికి ఇప్పటికే బీటలు వారుతున్నాయని, వారిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. ఓ వైపు కాంగ్రెస్, డీఎంకే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీలు కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ కలిసి కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాయని చెప్పారు. మహాకూటమి విఫల ఆలోచన అన్నారు. మోడీ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశం భారత్ అన్నారు. మోడీ మళ్లీ మన ప్రధాని కావాలా? లేదా అస్పష్టమైన విధానాలతో ఏర్పాటవుతున్న కూటమి అధికారంలోకి రావాలా? అనే విషయంపై ఆలోచించి ప్రజలు లోకసభ ఎన్నికల్లో ఓట్లు వేస్తారన్నారు.