ఎంత చెప్పినా విన్లేదు.. అనుభవిస్తున్నాడు: కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంపై అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించానన్నారు హజారే. అయితే, మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ ఏకంగా మద్యం కోసం ప్రత్యేక విధానాన్నే తీసుకొచ్చారని విమర్శించారు.
కేజ్రీవాల్ అరెస్టును పలు విపక్ష పార్టీలు నిరసిస్తున్న క్రమంలో అన్నా హజారే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అరవింద్ కేజ్రీవాల్ గతంలో అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హాజారే.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు.

అరవింద్ కేజ్రీవాల్ గతంలో నాతో పనిచేశారు. మద్యానికి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. అలాంటిది నేడు మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది. కానీ, ఇప్పుడేం చేయగలం. చట్టం ప్రకారం ఏదీ జరిగినా ఎదురు చెప్పలేం అని హజారే వ్యాఖ్యానించారు.
కాగా, 2011లో అన్నా హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. ఈ పోరాటం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. అయితే, హజారే మాత్రం మొదటి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పలు అంశాల్లో కేజ్రీవాల్ పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు హజారే. కానీ, కేజ్రీవాల్ మాత్రం వాటికి స్పందించేవారు కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి కూడా అన్నా హజారే గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అంతేగాక, తన బాధను వివరిస్తూ 2022లో కేజ్రీవాల్కు ఘాటు లేఖ కూడా రాశారు. మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం గురించి తెలిసి చాలా బాధ కలిగింది. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్లు కనిపిస్తోందంటూ ఘాటుగా స్పందించారు అన్నా హాజరే.












Click it and Unblock the Notifications