ప్రమాణ స్వీకారం: కేజ్రీవాల్ ఆహ్వానించారు.... మోడీ రావడం లేదు (ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో శనివారం రామ్ లీలా మైదానంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించారు. అయితే తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల వల్ల రాలేనని మోడీ చెప్పినట్లు తెలిపారు.
ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిశోడియా మీడియాతో మాట్లాడారు. వారిద్దరి మధ్య చర్చలు సామరస్య పూర్వకంగానే జరిగినట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరి 14వ తేదీన ఆప్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మోడీ హాజరుకావడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఆ రోజు ప్రధాని మోడీకి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్కు తెలియజేశారని శిశోడియా పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉండటం, ఢిల్లీలో ఆప్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఢిల్లీకి పూర్తి రాష్ట్రాధికారం ఇచ్చేందుకు ఇదే మంచి అవకాశమని ప్రధానికి వివరించామన్నారు.
దీనిపై స్పందించిన ప్రధాని మోడీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారని అన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయం తెలిసిందే.
సరిగ్గా ఏడాది క్రితం రాజీనామా చేసిన రోజునే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత వారంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో బేజీపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతలా వ్యవహారించారు: ఆప్ నేత
ప్రధాని నరేంద్రమోడీ తాను దేశానికి ప్రధానినన్న విషయాన్ని మరచి, ప్రతపక్ష నేతలా వ్యవహరించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ విమర్శించారు. ఢిల్లీ అసంబ్లీ ఎన్నికల వేళ ఆ విషయం స్పష్టమైందన్నారు.
ఓ ప్రధాని తన దేశానికి చెందిన వ్యక్తిని నక్సల్ అని పేర్కొంటే, ప్రజలు హర్షించరని అన్నారు. ప్రధాని మోడీని అభిమానించే వాళ్లు ఆ వ్యాఖ్యను అంగీకరించలేదని తెలిపారు. ప్రధాని మోడీ... ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ను అరాచకవాది అని, నక్సల్ అని పేర్కొని, అలాంటి వ్యక్తులు అడవుల్లో ఉండాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.