అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం.. గార్గి కాలేజీ ఘటనపై సీఎం కేజ్రీవాల్ సీరియస్
ఢిల్లీలోని గార్గి కాలేజీలో గురువారం జరిగిన వార్షిక సాంస్కృతి కార్యక్రమంలో ఓ అల్లరి మూక చొరబడి.. విద్యార్థినుల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. మన బిడ్డలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. మహిళా భద్రతపై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేజ్రీవాల్ పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గార్గి కాలేజీలో జరిగిన ఘటనను హౌజ్ ఖాన్ పోలీసులు సమోటో కేసుగా స్వీకరించి విచారణ ప్రారంభించారు. సీనియర్ పోలీస్ అధికారిణి గీతాంజలి ఖండెల్వాల్ నేత్రుత్వంలో కేసు విచారణ జరగనుంది. కాలేజీలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించి ఆరోజు అసలేం జరిగిందో నిర్దారిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా కాలేజీకి తమ బృందాన్ని పంపించింది.
కాగా,ఆరోజు రాత్రి క్యాంపస్లోకి చొరబడ్డ దాదాపు 30-35 మంది మూక విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల వైపు చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డారు. క్యాంపస్లో వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వారు క్యాంపస్ లోపలికి ప్రవేశించారని ఆరోపిస్తున్నారు.