రెడీ: కేజ్రీవాల్ మంత్రులు వీరే, అప్పుడే ముసలం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ తను ఏర్పాటు చేయబోయే మంత్రి వర్గంలోని సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ మంత్రివర్గంలో మనీష్ సిసోడియా, సూరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా, గిరిష్ సోనిలకు కేజ్రివాల్ స్థానం కల్పించారు. కేజ్రివాల్తోపాటు డిసెంబర్ 26న మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు.
మంత్రి వర్గ సభ్యులలో చోటు దక్కించుకున్న మనీష్ సిసోడియా ఆప్ తరపున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 41ఏళ్ల మనీష్ సిసోడియా గతంలో జర్నలిస్టుగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారి ప్రస్తుతం కేజ్రివాల్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేజ్రివాల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అతనివైపే ఉంటానని సిసోడియా ఇటీవల ట్విట్టర్లో పేర్కొన్నారు.

26 ఏళ్ల రాఖీ బిర్లా.. కేజ్రివాల్ ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు. షీలా దీక్షిత్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రిగా వ్యవహరించిన రాజ్కుమార్ చౌహాన్ను 10,500 ఓట్లతో తేడాతో రాఖీ బిర్లా ఓడించారు. కాగా పార్టీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే కేజ్రివాల్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాల్లో గెలిచి రెండో అతిపెద్ద పార్టీ నిలిచింది. కాగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తొలిస్థానంలో నిలిచింది.
బిజెపికి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయలేదు. 15 ఏళ్లుగా ఢిల్లీలో పాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తృతీయ స్థానంలో నిలిచింది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సహాయంతో ఆప్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
ముసలం
ఆమ్ ఆద్మీ పార్టీలో అప్పుడే ముసలం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ కూర్పుపై వినోద్ కుమార్ బిన్నీ అనే శాసనభ్యుడు అలిగినట్లు చెబుతున్నారు. మంత్రి వర్గం జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన రేపు బుధవారం మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications