జైల్లో షారుఖ్ ఖాన్ కుమారుడికి ఇస్కాన్, మౌల్వీలతో కౌన్సెలింగ్: భగవద్గీత, ఖురాన్, బైబిల్
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పరువు కోల్పోయిన హిందీ చలన చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలిపించారు. ఈ పరిస్థితుల్లో ఇదే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం మరో మలుపు తిరిగింది. హిందీ చలనచిత్ర పరిశ్రమకు డ్రగ్ పెడ్లర్స్ మధ్య విస్తృత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని బయటపెట్టినట్టయింది.
లగ్జరీ షిప్లో
ముంబై సముద్ర తీరంలో ఓ లగ్జరీ షిప్లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు కొద్ది రోజు కిందటే భగ్నం చేశారు. హైప్రొఫైల్ రేవ్ పార్టీ ఇది. ఓ విలాసవంతమైన షిప్లో దీన్ని ఆర్గనైజ్ చేశారు. నిషేధిత డ్రగ్స్ అన్నీ భారీ స్థాయిలో లభించాయి ఈ షిప్లో. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. లక్షల రూపాయల్లో నగదు మొత్తాన్ని సీజ్ చేశారు. అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్స్ ఎంప్రెస్ షిప్లో నిర్వహించిన రేవ్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. అతణ్ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
కస్టడీలో ఆర్యన్ ఖాన్..
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉంటోన్నాడు. అతనితో పాటు అరెస్టయిన మున్మున్ ధమేచ, అర్బాజ్ మర్చంట్ అధికారుల అదుపులోనే ఉన్నారు. బెయిల్ కోసం వారు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటీషన్పై విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. దీనితో నిందితులు ఎన్సీబీ కస్టడీలోనే కొనసాగుతున్నారు. ముంబైలోని అర్థర్ రోడ్లో ఉన్న కేంద్ర కారాగారంలో ఉంటోన్నారు.
ప్రత్యేక బ్యారక్కు తరలింపు..
కారాగారంలో ఇప్పటిదాకా ఉన్న సాధారణ బ్యారక్ నుంచి జైలు అధికారులు.. ఈ ఉదయం ఆర్యన్ ఖాన్ను ప్రత్యేక బ్యారక్కు తరలించారు. అతను ఉన్న బ్యారక్కు భద్రతను రెట్టింపు చేశారు. జైలు నిబంధనల ప్రకారం.. ఏడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉన్నందున జైలు అధికారులు అతణ్ని సాధారణ బ్యారక్లో ఉంచారు. ఇవ్వాళ్టితో క్వారంటైన్ కాలం ముగిసింది. దీనితో అతనికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించిన అనంతరం ప్రత్యేక బ్యారక్కు తరలించారు.
ఇస్కాన్, మౌల్వీలతో కౌన్సెలింగ్
క్వారంటైన్ కాలంలో జైలు, ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్తో పాటు మిగిలిన నిందితులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. డ్రగ్స్ సేవించడం వల్ల కలగే దుష్పరిమాణాల గురించి వివరించారు. ముంబైలోని ఇస్కాన్ ప్రతినిధులు, కొందరు మౌల్వీలతో కౌన్సెలింగ్ ఇప్పించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో- వారు ప్రశాంతంగా ఉండటానికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ కాపీలను వారికి అందజేశారని సమాచారం. సన్మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన ఉపన్యాసాలను ఇస్కాన్ ప్రతినిధులు, మౌల్వీల ద్వారా ఇప్పించారని చెబుతున్నారు. ఈ కేసులో మూడు మతాలకు చెందిన వారు ఉన్నందున.. ఆయా మత గ్రంధాలను వారికి అందించారని అంటున్నారు.
జోనల్ డైరెక్టర్ సమక్షంలో..
ఈ కౌన్సెలింగ్ ఇప్పించే సమయంలో వారి వెంట నార్కొటిక్స్ బ్యురో విభాగం ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె, కొందరు సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ఇదివరకు డ్రగ్స్కు బానిసగా మారి.. అనంతరం ఆ ఊబి నుంచి బయటికి వచ్చిన వారితోనూ ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచ, అర్బాజ్ మర్చంట్కు కౌన్సెలింగ్ ఇప్పించారని, ఫలితంగా వారిలో మార్పు కనిపిస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి బెయిల్ పిటీషన్పై విచారణ నిర్వహించనున్న నేపథ్యంలో- తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.