ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్; మెహబూబా ముఫ్తీపై ఢిల్లీ న్యాయవాది ఫిర్యాదు
పీడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఢిల్లీకి చెందిన న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఇటీవల మెహబూబా ముఫ్తీ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు 'ఖాన్' కారణంగా అతని కుమారుడిని టార్గెట్ చేస్తున్నట్లు మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. కేంద్ర సంస్థలు ఆర్యన్ ఖాన్ ను టార్గెట్ చేస్తుంది కేవలం ఆయన ఇంటిపేరు ఖాన్ వల్లే అంటూ ఆమె తీవ్ర స్థాయిలో బిజెపి సర్కారుపై ధ్వజమెత్తారు.
ఆర్యన్ ఖాన్ ను కేంద్ర సంస్థలు టార్గెట్ చేసింది అందుకే; బీజేపీపై మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్
ఆర్యన్ ఖాన్ కేసు, లఖింపూర్ ఖేరి కేసులను ఉదాహరిస్తూ మెహబూబా ముఫ్తీ షాకింగ్ వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోమవారం ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పీడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంపై కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ముంబై క్రూయిజ్ డ్రగ్స్ వివాదంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.మెహబూబా ముఫ్తీ ఆర్యన్ ఖాన్ కేసును, లఖింపూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడి కేసును పోల్చి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఖాన్ ఇంటి పేరు వల్లే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అన్న మెహబూబా ముఫ్తీ
కేంద్ర సంస్థలు నలుగురు రైతులను హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయలేదు కానీ, కేంద్ర సంస్థలు 23 ఏళ్ల ఖాన్ ఇంటి పేరు ఉన్న ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది న్యాయాన్ని అవమానించటం అంటూ ఆమె పేర్కొన్నారు. ముస్లింలను టార్గెట్ చేస్తూ బిజెపి తన కోర్ ఓటు బ్యాంకు వికృతమైన సంతృప్తి కోసం చేస్తున్న పనిగా ఆమె అభివర్ణించారు. ఇక మెహబూబా ముఫ్తీ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు, మతపరమైన రంగు పులమడంపై ఢిల్లీ న్యాయవాది ఆమెపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
మతపరమైన ఘర్షణలను ప్రేరేపించే వ్యాఖ్యలని ఫిర్యాదు చేసిన ఢిల్లీ న్యాయవాది
మెహబూబా ముఫ్తీపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద మతాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి ప్రయత్నించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. మెహబూబా ముఫ్తీ స్టేట్మెంట్ మతపరమైన ద్వేషం మరియు అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో ఉందని, ఇది మత ఘర్షణలను ప్రేరేపించే ప్రకటన అని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రకటనలో, మెహబూబా ముఫ్తీ కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. ఆర్యన్ ఖాన్పై చర్య తీసుకునే బదులు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్యన్ ఖాన్ కు నో బెయిల్.. లఖింపూర్ ఖేరీ ఘటనలో మంత్రి కొడుకుకు మూడు రోజుల కస్టడీ
అక్టోబర్ 2 న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసింది. అప్పటినుండి ఇప్పటివరకు కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూనే ఉంది. అక్టోబర్ 13 న తదుపరి బెయిల్ విచారణ జరగనుంది. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు . ఇదిలా ఉండగా, నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధించి లఖింపూర్ స్థానిక కోర్టు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల కస్టడీకి పంపింది.