అమిత్ షాపై ఘాటు పదాలతో చెలరేగిన ఒవైసీ: మందలించిన స్పీకర్: రికార్డుల నుంచి..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై చెలరేగిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి దొర్లాయి. ఒవైసీ మాటతీరుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒవైసీని మందలించారు. ఒవైసీ చేసిన కొన్ని వ్యాఖ్యానాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం ఉదయం లోక్ సభలో అమిత్ షా ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై వాడివేడిగా చర్చ కొనసాగింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు అధికార ఎన్డీఏ, ప్రత్యేకించి- అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగాయి. కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమిత్ షాపై ఘాటు పదాలతో విమర్శల దాడికి దిగారు.
చర్చ సందర్భంగా ఒవైసీ తన మాటల తూటాలను అమిత్ షాపై ఎక్కు పెట్టారు.ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అమిత్ షా కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యానికి చిరునామాగా ఉన్న భారత్ లో పౌరసత్వ సవరణ బిల్లు వంటివి ఉపయోగపడబోవని చెప్పారు. ఈ దేశం నుంచి ముస్లింలను తరిమేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తోందని అన్నారు.
ఈ దేశంలో ముస్లింలు కూడా ఓ భాగమనే విషయాన్ని అమిత్ షా విస్మరిస్తున్నారని చెప్పారు. అమిత్ షా ఆధునిక హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సమతౌలత్య దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని, పార్లమెంట్ సభ్యులందరూ దీన్ని తిరస్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తన ప్రసంగం సందర్భంగా ఒవైసీ కొన్ని పదాలను వాడటం పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన ఒవైసీని మందలించారు. ఇలాంటి పదాలను వాడటం సరికాదని హితబోధ చేశారు. అన్ పార్లమెంటరి పదాలను తాను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. మరోసారి అలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దని, ఆ అవసరం రానీయొద్దని ఓం బిర్లా.. అసదుద్దీన్ ఒవైసీకి సూచించారు.