అది సరిపోదు: బెజవాడకు విమానాలపై అశోక్ గజపతి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరిన్ని సార్లు భేటీ కావాల్సిన అవసరం ఉందని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. అఖిల భారత స్థాయి అధికారుల విభజన పూర్తయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉత్తర్వులు కేంద్రం నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన సరైన దిశలోనే సాగుతోందని ఆయన అన్నారు. ఏపీ నూతన రాజధానిగా ఎంపికైన విజయవాడకు ఢిల్లీ నుంచి నేరుగా విమానాలు నడుపుతారా అన్న ప్రశ్నకు గన్నవరం విమానాశ్రయంలో రెండు విమానాలు మాత్రమే నిలిపేందుకు స్థలం ఉందని, పెద్ద విమానాలకు దిగేందుకు రన్వే అనుకూలంగా లేదన్నారు. వీలైనంత త్వరగా ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.

సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని, తన అపాయింట్మెంట్ కోరినప్పుడు తానే ఏపీ భవన్కు వచ్చి కలుస్తానని చెప్పానని, కానీ కార్యాలయానికి వచ్చి కలుస్తానని గవర్నర్ చెప్పడంతో తాను స్వాగతించానన్నారు.
విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులను వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని అశోక్గజపతి రాజు ప్రకటించారు. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన కేంద్ర అధ్యయన బృందం అధ్యయనాన్ని పూర్తి చేసిందని, త్వరలోనే నివేదిక అందజేస్తుందని తెలిపారు. నివేదిక అందగానే వీలైనంత త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.












Click it and Unblock the Notifications