అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం: 9 మంది మృతి, బాధితులుగా 6.2 లక్షల మంది, ఇంకా వరదల్లోనే
గౌహతి: అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. 27 జిల్లాల్లో 6.62 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. వేలాది మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రైల్వే లైన్లు వరదలధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అస్సాంలో వర్ష బీభత్సం.. 9 మంది మృతి
భారీ వర్షాలు, వదరల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పశువులు మరణించాయి. ఒక్క నాగౌన్ జిల్లాలోనే 2.88 లక్షల మంది భారీ వర్షలు, వరదలకు ప్రభావితులయ్యారు. కచర్ జిల్లాలో 1.19 లక్షల మంది, హోజాయి జిల్లాలో 1.7 లక్షల మంది, డర్రంగ్ జిల్లాలో 60,562 మంది, బిశ్వనాథ్ జిల్లాలో 27,282 మంది, ఉదల్గురి జిల్లాలో 19,755 మంది ప్రజలు వర్షాలు, వరదల బాధితులుగా మారారు.

వరద నీటిలోనే గ్రామాలు, పంట భూములు
బొంగైగావ్, బక్సా దిబ్రూఘర్, ధేమాజీ, గోల్పరా, బార్పేట లఖింపూర్, మజులి, మోరిగావ్, నల్బరీ, సోనిత్పూర్, కమ్రూప్ జిల్లాలు కూడా భారీ వర్షాలకు ప్రభావితమయ్యాయి.
"ఈ వరదల కారణంగా 70 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1413 గ్రామాలు ప్రభావితమయ్యాయి, 46160.43 హెక్టార్ల పంట భూములు ముంపునకు గురయ్యాయని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. కాచర్ జిల్లాలో వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు.
సహాయక శిబిరాల్లోనే వరద బాధితులు
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తోంది అధికార యంత్రాంగం. జిల్లా యంత్రాంగం 135 సహాయ శిబిరాలు, 113 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది, ఇందులో 6,911 మంది పిల్లలు, 50 మంది గర్భిణులు, బాలింతలు సహా 48,304 మంది వరద ప్రభావిత ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని నివేదిక తెలిపింది.

ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, ఆందోళనలో ప్రజలు
నాగౌన్ జిల్లాలోని కంపూర్ కొంపిలి నది ఇప్పటికీ ఉధృతంగానే ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిలో వరదనీటితో ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరి కొద్ది రోజులపాటు అస్సాం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

అలర్ట్ చేస్తున్న ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం..
వరద ప్రభావిత ప్రాంతాలో భారత సైన్య, జాతీయ విపత్తు సహాయక దళాలు, రాష్ట్ర విపత్తు సహాయక దళాలు, అగ్నిమాపక, ఎమర్జన్సీ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న 8054 మందిని ఈ సహాయక బృందాలు కాపాడాయి. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, ప్రజలను ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలపై అప్రమత్తం చేస్తూనే ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది.












Click it and Unblock the Notifications