అస్సాం ఎన్సార్సీ అమల్లో మరో ట్విస్ట్- జాబితా మార్పు కోసం సుప్రీంకు బీజేపీ సర్కార్
భారత్లో పౌరసత్వ సవరణ చట్టం ఎన్సార్సీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా రికార్డులకెక్కిన అస్సోంలో ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచనలో పడింది. గతంలో తాము రూపొందించిన జాబితా ప్రకారం ఏకంగా 19 లక్షల మంది విదేశీయులుగా తేలడంతో వీరంతా కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ జాబితాలో సవరణలకు అనుమతించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.
అస్సోంలో ఎన్సార్సీ అమలు ద్వారా 19 లక్షల మంది విదేశీయులుగా తేలారు. వీరంతా తమ వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో పౌరులుగా గుర్తింపు కోసం విదేశీ ట్రైబ్యునల్స్ను ఆశ్రయించారు. కానీ వీరిలో చాలా మంది ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఇప్పుడు వారిని బుజ్జగించేందుకు ఆ జాబితాలో సవరణలకు సిద్దమవుతోంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
గతేడాది జూలైలో అస్సోం ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ఎన్నార్సీ జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సమన్వయకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ జాబితాను సమగ్రంగా మారుస్తామని, ఆ తర్వాత ని్ర్ణీత కాలవ్యవధిలోగా దీన్ని అమలు చేసేందుకు వీలుగా అనుమతి మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అభ్యర్ధించారు. దీంతో ఎన్సార్సీ అమలు వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.