మరికొద్ది గంట్లలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు, యూపీపైనే ఫోకస్
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన అన్ని పనులను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూ రాష్ట్రాల్లో మార్చి 27తో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు మార్చి 10న గురువారం వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఫలితాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అంతేగాక, ఈ ఎన్నికలు పలు పార్టీల భవితవ్యం కూడా తేల్చనున్నాయి. కాగా, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలోని 690 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పోలీసు అబ్జర్వర్లు, 10 మంది ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగుతారని సీఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
యూపీ బీజేపీ.. పంజాబ్ ఆప్ అంటూ..
ఉత్తరప్రదేశ్ 80 మంది ఎంపీలను లోక్సభకు పంపుతుంది, ఇది ఏ రాష్ట్రానికైనా అత్యధికం. అందువల్ల, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ), మోడీ ప్రభుత్వానికి ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు. అలాగే, పార్టీ పనితీరు 2024లో జరగనున్న తదుపరి సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లో బీజేపీకి, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అలాగే, ఈ ఎగ్జిట్ పోల్స్ గోవాలో హంగ్ అసెంబ్లీ, ఉత్తరాఖండ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని అంచనా వేశాయి. అనేక ఎగ్జిట్ పోల్స్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయని తేలింది.
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కోసం భారీ ఏర్పాట్లు
ఓట్ల లెక్కింపు కోసం ఐదు రాష్ట్రాల్లోని దాదాపు 1,200హాళ్లలో 50,000 మందికి పైగా అధికారులను మోహరించారు. అలాగే, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ఫలితాల ప్రక్రియలో కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరిస్తారని అధికారులు తెలిపారు. అత్యధికంగా 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో 750కి పైగా కౌంటింగ్ హాళ్లు ఉంటాయి. ఐదు రాష్ట్రాల్లో, ప్రక్రియను పర్యవేక్షించడానికి 650 మందికి పైగా కౌంటింగ్ పరిశీలకులను నియమించారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద వీడియో, స్టాటిక్ కెమెరాలను అమర్చినట్లు లక్నోలోని ఒక అధికారి తెలిపారు. మార్చి 10న ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు మొత్తం 250 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు) అందించినట్లు పోలీసులు తెలిపారు. ఒక CAPF కంపెనీలో సాధారణంగా 70-80 మంది సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు.