మస్ట్ రీడ్: ముగిసిన 70 ఏళ్ల స్నేహం... వాజ్పేయి మృతితో ఒంటరి వాడైన అద్వానీ
అటల్ బిహారీ వాజ్పేయి... అపరమేధావి...రాజకీయ భీష్ముడు.. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన రాజకీయ దురందరుడు. పోఖ్రాన్ అణుపరీక్షతో దేశాన్ని రక్షణరంగంలో పటిష్టపరిచిన యోధుడు. కచ్చితమైన నిర్ణయాలతో దేశానికి సుపరిపాలన అందించిన గొప్ప నేత. ఎంత గొప్పవారికైనా వారి విజయం వెనక ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. అలాంటి వారిలో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఒకరు. వాజ్పేయి మృతితో అత్యంత సన్నిహితుడిని కోల్పోయామని ఎవరైనా అనుకుంటే అది ఒక్క అద్వానీ మాత్రమే. ఎందుకంటే వీరిద్దరి మధ్య స్నేహం 70 ఏళ్లనాటిది.
వాజ్పేయి-అద్వానీ ఇదే జోడీ బీజేపీలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇద్దరి మధ్య వయస్సులో తేడా కేవలం మూడేళ్లు మాత్రమే. దాదాపు 70 ఏళ్ల వరకు వారిద్దరూ రాజకీయ మిత్రులు, సన్నిహితులు కూడా. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, గౌరవం ఉండేది. అదేసమయంలో కొన్ని నిర్ణయాలపై ఇద్దరూ విభేదించేవారు కూడా. వాజ్పేయికి రాజకీయంగా ప్రజల్లో ఒక రకమైన ఫాలోయింగ్ ఉంటే.. అద్వానీకి మరో రకమైన ఫాలోయింగ్ ఉండేది. వారి రాజకీయ వ్యవహార శైలి, సామాజిక స్పృహ, నమ్మకాలు ఇద్దరిని వేర్వేరు రాజకీయ ప్రయాణాల వైపు అడుగులు వేసేలా చేశాయి. కానీ అటల్ బిహారీ వాజ్పేయ్- ఎల్కే అద్వానీల మధ్య స్నేహం మాత్రం భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది.
జనసంఘ్ పార్టీతో ప్రారంభమైన అటల్-అద్వానీ రాజకీయ జీవితం
అటల్ అద్వానీ ఇద్దరు రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచే నేతలుగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు ఇద్దరూ కష్టపడ్డారు. ఇద్దరికి సాహిత్యం, జర్నలిజం, సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆర్ఎస్ఎస్లో బాగా కష్టపడేవారిని ఆ శాఖ రాజకీయపార్టీ అయిన భారతీయ జనసంఘ్లోకి పంపింది. 1951లో స్థాపించిన ఈ పార్టీ ద్వారా అటల్ అద్వానీ ద్వయం రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. జనసంఘ్ పార్టీ ఆవిర్భావంలో వీరిద్దరూ భాగస్వాములై అంతా తామై పార్టీని నడపించారు.
దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మృతి తర్వాత అప్పటికే పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న వాజ్పేయి పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే అద్వానీ కూడా బాధ్యతలను చూశారు. ఎమర్జెన్సీ సమయంలో అటల్ -అద్వానీ ద్వయం జైలు జీవితాన్ని గడిపింది. కాంగ్రెస్ను మట్టి కరిపించిన జనతా పార్టీలోకి జనసంఘ్ పార్టీని విలీనం చేయాలని ఇద్దరూ నిర్ణయించారు. ఆ సమయంలో వాజ్పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అద్వానీ సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
జనతా పార్టీ నుంచి బయటకొచ్చి బీజేపీ స్థాపించిన మిత్రులు
ముందునుంచి ఉన్న ఆర్ఎస్ఎస్తో అటల్ -అద్వానీలు సఖ్యతగా ఉంటారా లేక జనత పార్టీ మాట వింటారా అనే ప్రశ్న అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీంతో ఇద్దరు నేతలు జనతాపార్టీ నుంచి బయటకువచ్చి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా వాజ్పేయి ఉన్నారు. తొలినాళ్లలో బీజేపీ చాలా కష్టాలు ఎదుర్కొని నిలదొక్కుకుంది. 1980లో పార్టీ పగ్గాలు అద్వానీ చేతికి వచ్చాకా బీజేపీ పుంజుకుంది. హిందూత్వ రాజకీయాలపైనే పార్టీ విస్తరించింది. ఇదే సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి కొంత దూరంగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వాజ్పేయి కట్టుబడి ఉన్నారు కానీ... బాబ్రీ మసీదును కూల్చేందుకు అద్వానీ కదిపిన పావులను వ్యతిరేకించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అద్వానీ ఒక గొప్ప నాయకుడిగా ఫోకస్ అయ్యారు. కొత్త తరం బీజేపీ నాయకులకు అద్వానీ దేవుడిలా కనిపించాడు.
అటల్ బిహారీ వాజ్పేయి- అద్వానీలకు ఒకరి బలం ఒకరికి తెలుసు,ఒకిరి అభిప్రాయాలతో ఒకరు విభేదించేవారు, కానీ ఇద్దరి లక్ష్యాలు మాత్రం ఒకటిగా ఉండేవి. పార్టీ ప్రధాని అభ్యర్థిగా వాజ్పేయి పేరును అద్వానీ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ.ఇక స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఓ మహావృక్షంలా ఏర్పడిందంటే ఇందుకు కారణం వాజ్పేయి అద్వానీల ద్వయమే.
Recommended Video
బీజేపీ ప్రభుత్వంలో పవర్ సెంటర్లుగా నిలిచిన అటల్-అద్వానీ జోడీ
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆనాడు వాజ్పేయి అద్వానీలు ప్రభుత్వంలో పవర్ సెంటర్లుగా నిలిచారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ఉద్రిక్తత పరిస్థితులను దేశం ఎదుర్కొంది. పలు అంశాలపై ఏకభిప్రాయం కుదరలేదు.అయినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ విడిపోలేదు. దేశ ప్రధానిగా వాజ్పేయి ఉంటే, డిప్యూటీ ప్రధానిగా అద్వానీ బాధ్యతలు చేపట్టారు.2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. క్రమంగా రాజకీయాలకు వాజ్పేయి దూరం అవుతూ వచ్చారు. దీంతో 2009లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నుంచి అద్వానికి మార్గం సుగుమం అయ్యింది.
వాజ్పేయి చూసిన విజయాలు అద్వానీ చూడలేకపోయారు
అయితే ఇప్పటి దాకా వాజ్పేయి చూసిన విజయాలు అద్వానీ చూడలేకపోయారు. ప్రధాని అవ్వాలన్న తన కోరికను 2014లో సాకారం చేసుకుందామనుకున్న అద్వానికి... తన శిష్యుడైన మోడీ అడ్డుగా రావడంతో ఇక తన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని అంతా భావించారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న అద్వానీకి కనీసం ఒక మంత్ర పదవి కూడా మోడీ ఇవ్వకపోవడం పెద్ద చర్చకే దారి తీసింది.
ఇక అటల్ బిహారీ వాజ్పేయి మృతితో ఎక్కువగా బాధపడేవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అద్వానీనే అని చెప్పక తప్పదు. వారిద్దరి జీవితాల్లో భారత రాజకీయ చరిత్ర దాగిఉంది. వారిద్దరి జీవితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా ఎలా ఎదిగింది అనే రహస్యం దాగి ఉంది. ఇక ఇద్దరి జీవితాల్లో విభేదాలు వచ్చినప్పటికీ వారి మధ్య మాత్రం స్నేహం మాత్రం చెరిగిపోలేదు. ఆ గౌరవం, ఆ ఆప్యాయత గత 70 ఏళ్ల నుంచి ఇప్పటికీ అలానే ఉంది. వాజ్పేయి మృతితో అద్వానీ ఇప్పుడు పూర్తిగా ఒంటరి వాడయ్యారనే చెప్పాలి.