అటల్ టన్నెల్ దేశ రక్షణకు కీలకమన్న మోడీ- గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై విసుర్లు...
హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ నుంచి కశ్మీర్లోని లేహ్ను కలిపే ప్రపంచంలోని అత్యంత పొడవైన రహదారి సొరంగం అటల్ టన్నెల్ను ప్రధాని మోడీ ఇవాళ రోహ్తంగ్లో ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఇంజనీరింగ్ అద్భుతం అటల్ టన్నెన్ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... అటల్ టన్నెల్ నిర్మాణానికి శంఖుస్ధాపన జరిగినప్పటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకూ చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ కల నెరవేర్చేందుకు జరిగిన ప్రయత్నాలను వివరించారు.
అటల్ టన్నెల్ కశ్మీర్లోని లడఖ్కు జీవన ప్రదాయిని అని మోడీ అభివర్ణించారు. సైనిక బలగాలను తక్కువ సమయంలో లేహ్కు చేర్చేందుకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సరిహద్దు భద్రత పరంగా ఈ సొరంగం చాలా కీలకమన్నారు. దేశ రక్షణకు మించిన ప్రాధాన్యమేదీ లేదని, కానీ గతంలో దేశ రక్షణలోనూ రాజీపడిన సందర్భాలను ప్రజలు చూశారని యూపీఏ సర్కారును ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.
Recommended Video
అనుసంధానం అభివృద్ధికి కీలకమని, సరిహద్దుల్లో అయితే ఇది దేశ రక్షణకూ కీలకమని ప్రధాని మోడీ తెలిపారు. కానీ వాజ్పేయ్ పాలన అనంతరం అటల్ టన్నెల్ను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇది అటల్జీ కల సాకారం మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక కూడా అని ప్రధాని తెలిపారు. 10 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన అటల్ టన్నెల్ ద్వారా హిమాచల్ వంటి చిన్న రాష్ట్రం దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.