బీజేపీ పాలనలో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారు: మమతా బెనర్జీ
కోల్కతా: దేశంలో అన్ని సంస్థలను బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఈ మధ్యనే అంతరిక్షంలో ఉపగ్రహంను కూల్చేవేసే క్షిపణి ప్రయోగం విజయవంతం అవడంతో ప్రధాని మోడీ ఈ విషయాన్ని దేశానికి చాటి చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు.
మార్చి 27న డీఆర్డీఓ మిషన్ శక్తి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ నిలిచింది. ఇది బీజేపీ ప్రభుత్వం ఘనతే అని ప్రధాని చెప్పుకున్నారన్న దీదీ... దేశంలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ తన అధీనంలోకి తీసుకుంటోందని ఆరోపించిన మమతా బెనర్జీ.... ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఒక నియంత పాలనలో ప్రజలు తాము స్వేఛ్ఛగా మాట్లాడలేకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదని విమర్శించిన దీదీ... కనీసం పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కింద రైతులు, ఇతర వర్గాల వారు చాలా అసంతృప్తితో ఉన్నారని మమతా చెప్పారు. అందుకే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేంకగా దేశంలోని అన్ని శక్తులు ఒక్క తాటిపైకొచ్చి పోరాడుతున్నాయని మమతా అన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను మద్దతు పలికేందుకే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు. ఇక బెంగాల్లో దాదాపు 100 బహిరంగ సభల్లో తాను పాల్గొనబోతున్నట్లు చెప్పారు.