కరోనా డాక్టర్లపై భయానక దాడి.. వాళ్లు మనుషులే కాదన్న సీఎం.. అక్కడైతే నడిరోడ్డుపై కాల్చివేత..
మంచిపనికి ఎప్పుడూ దూరంగా.. తీట పనులకు మాత్రం సర్వదా సిద్ధంగా ఉంటామంటూ కొందరు ప్రవర్తిస్తున్న తీరు యావత్ మానవాళికే ముప్పుగా మారింది. ఒక దిక్కు వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు పెరిగినా.. 50 వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. ఇప్పటికీ చాలా మంది కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. అన్ని దేశాల్లో లాక్ డౌన్ ధిక్కారాలు కొనసాగుతున్నాయి. మనదేశంలోనేతే ఏకంగా కరోనా డాక్టర్లపై భయానక దాడులకుయత్నం, వైద్య సిబ్బందిపై దుర్బాషలు సాధారణంగా మారాయి. ఇలాంటోళ్ల భరతం పట్టడానికే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఏకంగా 'షూట్ ఎట్ సైట్' ఉత్తర్వులు జారీచేశారు.
ఇండోర్లో దారుణం..
నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతంతో ఇండియాలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రార్థనలకు వెళ్లొచ్చివాళ్లలో కొందరు.. వైరస్ ను మోసుకురావడమే కాకుండా, ఆస్పత్రుల్లో చికిత్సకు సహకరించకుండా డాక్టర్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లో చనిపోయిన ఓ పేషెంట్ తాలూకు బంధువులు.. గాంధీ డాక్టర్లు, సిబ్బందిపై చేయిచేసుకున్నారు. మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ లోనైతే ఏకంగా కాలనీలన్నీ ఒక్కటై.. కరోనా డాక్టర్లపై రాళ్లు, కర్రలతో భయానకరీతిలో దాడికి యత్నించాయి. సిటీలోని సిలావట్ పూర్, తాట్పత్లీ ఏరియాల్లో చోటుచేసుకున్న ఆ ఘటన తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి. జనం దాడి నుంచి తృటిలో తప్పించుకున్న డాక్టర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
ఇండోర్ సిటీలో కరోనా వైద్య సిబ్బందిపై దాడి ఘటనను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. దాడులకు పాల్పడినవాళ్లను ఉద్దేశించి ఆయన ఘాటు కామెంట్లు చేశారు. ‘‘ఇది కేవలం ట్వీట్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఒక ముఖ్యమంత్రిగా హెచ్చరిస్తున్నా.. గుర్తుపెట్టుకోండి.. మనుషులకు మాత్రమే మానవ హక్కులుంటాయి.. ''అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తద్వారా దాడులకు పాల్పడేవాళ్లను మనుషులుగా గుర్తించబోమని, హక్కులు వర్తించవుగనుక వాళ్లపై తీవ్రచర్యలకు దిగుతామని ఆయన పరోక్షంగా అన్నారు.
కేంద్రం తాజా ఆదేశాలు..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాల ధిక్కరణ, కరోనా వైద్య సహాయక బృందాలపై దాడులు పెరిగిపోతుండటంపై కేంద్రంం స్పందించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం ప్రత్యేక ఆదేశాలు పంపారు. రూల్స్ ను అతిక్రమించేవాళ్లను, దాడులకు పాల్పడేవాళ్లకు ఇకపై కఠినాతికఠినంగా శిక్షలు వేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, లాక్ డౌన్ ఉల్లంఘనులపై ఫిలిప్పీన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది..
Recommended Video
కనిపిస్తే కాల్చివేత..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అన్ని దేశాల్లోలాగే ఫిలిప్పీన్స్ లోనూ లాక్ డౌన్ కొనసాగుతున్నది. మిగతా దేశాల్లోనే ప్రజల్లాగే ఫిలిప్పీన్స్ ప్రజలు కూడా ఇష్టారీతిగా రూల్స్ అతిక్రమిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా రోడ్లపైకి రావడం, గుంపులుగా తిరగడం మానడంలేదు. దీంతో ఆ దేశ ప్రెసిడెంట్ రిడ్రిగో డ్యుటెర్తీ గురువారం ‘షూట్ ఎట్ సైట్'కు ఆదేశిస్తానని హెచ్చరించారు. గతంలో ఆయన ఇదే తరహా ఆదేశాలిచ్చి డ్రగ్ మాఫియాను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేశారు. ఆ అనుభవం దృష్ట్యా జనం మాటవింటారని, లేకుంటే నిజంగానే కాల్చిపారేస్తామని ఆయన చెప్పారు. తద్వారా మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన ‘‘మానవహక్కులనేవి మనుషులకు మాత్రమే వర్తిస్తాయి''అనే పాయింట్ ను ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అమలుచేసి చూపిస్తున్నారు.