వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు, నా భార్య అడిగితే..: శశికళపై పన్నీరు సంచలనం
జయలలిత మృతిపై దర్యాఫ్తు జరిపించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి పెంచుతూ.. మాజీ సీఎం పన్నీరు సెల్వం శుక్రవారం నాడు మరిన్ని అంశాలను తెరపైకి తీసుకు వచ్చారు.
చెన్నై: జయలలిత మృతిపై దర్యాఫ్తు జరిపించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి పెంచుతూ.. మాజీ సీఎం పన్నీరు సెల్వం శుక్రవారం నాడు మరిన్ని అంశాలను తెరపైకి తీసుకు వచ్చారు.
దివంగత జయలలితకు చికిత్స అందించిన వైద్యులు తనకు కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించారని తెలిపారు. అయితే, తాను అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు, ఆమె కుటుంబ సభ్యులకు వ్యతిరకంగా ఉన్నానని నిర్ధారించుకున్నాకే వైద్యులను తనను కలిశారని చెప్పారు. తనకు విలువైన సమాచారం ఇచ్చారన్నారు.
నా భార్య అడిగితే..
జయలలిత ఆరోగ్యం గురించి తన భార్య వాకబు చేసినప్పుడు ఏమీ చెప్పలేక తానెంతో ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తుచేసుకున్నారు. తనకు అమెరికా లేదా బ్రిటన్లో చికిత్స చేయించాలని జయలలిత పార్టీ నాయకులను చాలాసార్లు అడిగారని చెప్పారు. తనపై ఒత్తిడి రావడం వల్లే సీఎం పదవి అంగీకరించానని, జయ మృతిపై దర్యాఫ్తు చేయించాలన్నారు.
జయ మృతికి శశికళనే కారణం
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొన్ని రోజులకే జయలలిత మృతి చెందారని ఇందుకు కారకురాలు శశికళనే అని పన్నీరు సెల్వం ఆరోపించారు. జయ మృతి పైన ఎలాంటి దర్యాఫ్తు చర్యలు చేపట్టకపోతే తాను మార్చి 8వ తేదీన తన మద్దతుదారులు, పార్టీ నేతలతో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.
వైద్యులు నాతో మాట్లాడారు
అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేసిన వైద్యులు తనతో పలుమార్లు మాట్లాడారని చెప్పారు. జయకు మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకెళ్లాలని అప్పట్లో తాను సూచించానని, అయితే తమకు అందుకు కొందరు అనుమతివ్వలేదని డాక్టర్లు తనకు చెప్పారన్నారు. విదేశాలకు అమ్మను తీసుకెళ్లకుండా కుట్రతో శశికళ అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికలకు వెళ్దామని చెప్పి..
ఒకవేళ శశికళ సీఎం అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్దామని అన్నాడీఎంకే నేతలు తనతో చెప్పారని, పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు అదే నేతలు మంత్రివర్గంలో కొనసాగుతున్నారని పన్నీరు సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే దర్యాఫ్తుకు..
శశికళ పదేపదే అందరికీ అడ్డు చెప్పడంతోనే జయలలితకు మెరుగైన చికిత్స ఇప్పించలేకపోయామని వైద్యులు చెప్పిన తర్వాత ఇక ఆలస్యం చేయవద్దని దర్యాఫ్తు జరిపించాలని పన్నీరు సెల్వం, ఆయన వర్గీయులు అంటున్నారు.