కరోనాకు తొలి ఎంపీ బలి: పార్లమెంట్ సమావేశాలపై స్పీకర్ ఓం బిర్లా కీలక సూచనలు - 72 గంటల ముందే..
ఇంకొద్ది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, ఓ సిట్టింగ్ ఎంపీ కరోనా మహమ్మారి కాటుకు బలికావడం కలకలంగా మారింది. కన్యాకుమారి లోక్సభ సభ్యుడు వసంతకుమార్(70) కొవిడ్ వ్యాధికి చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం కీలక సూచనలు చేశారు.
ఎంపీలు అందరూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కనీసం 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, ఎంపీలతోపాటు పార్లమెంట్ సిబ్బంది, ఆవరణలోకి వచ్చే వివిధ శాఖల అధికారులు, మీడియా సిబ్బందికి సైతం ఈ సూచన వర్తిస్తుందని స్పీకర్ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. కొవిడ్-19 నేథ్యంలో ఈసారి సకల జాగ్రత్తలతో సరికొత్త రీతిలో సమావేశాలు జరిపేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ భేటీ కానున్న నేపథ్యంలో సభలో ఏర్పాట్లపై స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, డీఆర్డీఓ అధికారులతో స్పీకర్ సుదీర్ఘంగా మాట్లాడారు. పార్లమెంటుకు వచ్చే ఏ ఒక్కరిని కూడా ముట్టుకోకుండానే తనిఖీలు చేసే విధానాన్ని అవలంభించాలని నిర్ణయించారు. అంతేకాదు,

సమావేశాల మధ్యలో ర్యాండమ్ గా ఎంపీలు, సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తామని, గతంలో మాదిరి రెండు సభలూ ఒకే సమయానికి కాకుండా, షిఫ్టులవారీగా ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్వహణకు కోవిడ్-19 ప్రధాన సవాలు విసిరింది. కోవిడ్ సంబంధిత నియమ నిబంధనలను పాటించడం ద్వారా పార్లమెంటు సమావేశాలకు సభ్యులంతా సహకరిస్తారని ఆశిస్తున్నా' అని ఓం బిర్లా పేర్కొన్నారు.
దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం కొత్తగా 1808 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1.69లక్షలకు పెరిగింది. అయితే, అందులో 1.51లక్షల మంది ఇప్పటికే వ్యాది నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 13,550గా ఉంది. శుక్రవారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 34.6 లక్షలకు, మరణాల సంఖ్య 62,691కి పెరిగింది. రికార్డు స్థాయిలో రికవరీ రేటు ఉండటంతో ఇప్పటికే 26.44 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7.51లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications