కళ్లు చెదిరే ప్యాకేజీ: ఒక్కో విద్యార్థికి రూ.22లక్షలు.. ఐఎస్బి ప్లేస్మెంట్స్!
తాజా ఐఎస్బి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 21జాబ్స్ ఆఫర్ చేయడం విశేషం. పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21పోస్టులను ఏపీ సర్కార్ ఆఫర్ చేసింది.
న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) విద్యార్థులు కళ్లుచెదిరే ప్యాకేజీలను దక్కించుకున్నారు. సగటు వేతనం కింద రిక్రూటర్లు వారికి రూ.22లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని ఐఎస్బి యాజమాన్యం తెలిపింది. మొత్తం 1,113మంది విద్యార్థులు తాజా ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు పొందినట్లు తెలియజేసింది. గతంతో పోల్చితే తాజా ప్లేస్మెంట్స్లో 39శాతం మేర రిక్రూటింగ్ కంపెనీలు పెరగడం విశేషం.
ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో లీడర్ షిప్ స్థానాల్లోనే ఎక్కువగా రిక్రూట్మెంట్లు జరిగినట్లు ఐఎస్బి పేర్కొంది. రిక్రూట్మెంట్లలో ఐటీ రంగ సంస్థలే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఐటీ రంగం అనిశ్చితిలో కొనసాగుతున్నప్పటికీ.. రిక్రూట్ మెంట్లలో భారీ మొత్తాలనే ఆఫర్ చేశాయి. 20నుంచి, 21శాతం వరకు ఈ ఐటీ/ఐటీఈఎస్ రంగాలు ప్యాకేజీలను ప్రకటించాయి.
ఐటీ తర్వాత బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, ఫార్మా రంగాలు నిలిచినట్లు ఐఎస్బి పేర్కొంది. 400కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్యాంపస్ ఆఫర్లలో పాల్గొన్నాయి. టాప్ రిక్రూటర్లుగా మెక్ కిన్సీ అండ్ కంపెనీ, బీఎస్జీ, ఆపిల్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంకు, నోవర్టీస్, అమెజాన్, కాగ్నిజెంట్, హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్, జోన్స్ లాంగ్ లాసాల్లె, హవెల్స్, రెవిగో, పీ&జీ, లెండింగ్ కార్ట్, రిలయన్స్ జియో, మైండ్ ట్రీ కన్సల్టింగ్, రొనాల్డ్ బెర్జర్ లు ఉన్నాయి.
తాజా ఐఎస్బి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 21జాబ్స్ ఆఫర్ చేయడం విశేషం. పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21పోస్టులను ఏపీ సర్కార్ ఆఫర్ చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, సిటీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, టెక్ మహీంద్రా, మ్యాక్స్, గెన్ ప్యాక్ట్ సంస్థలు లీడర్ షిప్ పొజిషన్లకు ఐఎస్బి విద్యార్థులను ఎంపిక చేశాయి. వీటితో పాటు అశోక్ లేల్యాండ్, యాక్సిస్ బ్యాంకు, కార్గిల్, ఆపిల్, ల్యాండ్ మార్క్ గ్రూప్, బేకరెంట్, క్రెడిట్ యాక్సిస్ ఆసియా వంటి అంతర్జాతీయ సంస్థలు తొలిసారి ఐఎస్బి విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నాయి.