విలాసలొద్దు: మంత్రులకు మోడీ హెచ్చరికలు
న్యూఢిల్లీ: వీఐపీ, బుగ్గకార్ల సంస్కృతిని వదిలేయాలని ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తాజాగా తన మంత్రివర్గ సహచరులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పర్యటనలకు వెళ్లేటప్పుడు 5నక్షత్రాల హోటళ్లలో బస చేయవద్దని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులకు హెచ్చరించారు.
గట్టి హెచ్చరిక
తమ మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎలాంటి సౌకర్యాలు ఆశించకూడదని, కనీసం అవి సమకూర్చే కార్లను కూడా ఉపయోగించకూడదని మోడీ గట్టిగా చెప్పారు.
Recommended Video
తీవ్ర అసంతృప్తి
మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత అందర్నీ ఉండాలని చెప్పి ఇలాంటి పనులు చేయెద్దంటూ మందలించారు. కొందరు మంత్రులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిథి గృహాల్లో కాకుండా విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మోడీ.
ప్రభుత్వ బంగళాల్లోనే..
హోటళ్లలో ఉండాలన్న ఆకర్షణకు లోనుకావద్దని, కచ్చితంగా ప్రభుత్వ బంగళాల్లోనే ఉండాలని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బహుమతులు తీసుకోవడంపైనా హెచ్చరించారు. మంత్రులుగానీ, వారి కుటుంబ సభ్యులుగానీ ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను ఉపయోగిస్తే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
అవినీతిని సహించేది లేదు..
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని తెలిపారు. దాంతో సొంత అవసరాలకు ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తీసుకురావద్దంటూ కొందరు మంత్రులు వారి సిబ్బందికి చెప్పారు. 2019 ఎన్నికల నాటికి అవినీతి రహిత ప్రభుత్వం అన్న గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో ప్రధాని సహచరులపైనా కఠినంగానే ఉంటున్నారు. మరోవైపు బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘తిరంగా యాత్ర'తో ప్రజల్లో సమగ్రత భావం పెంపొందుతుందని ప్రధాని మోడీ అన్నారు. 2022 వరకు నిర్దేశించుకున్న నవ భారత నిర్మాణ లక్ష్యంలో ప్రజలను మమేకం చేసేందుకే పార్టీ ఈ యాత్ర చేపట్టిందని మోడీ చెప్పారు.